నా కెరీర్‌లో పంతం బెస్ట్‌

Pantham Movie Success Meet - Sakshi

గోపీచంద్‌

‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్‌ చేశారు’’ అని గోపీచంద్‌ అన్నారు. గోపీచంద్, మెహరీన్‌ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్‌ ఎ కాస్‌’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కె.కె. రాధామోహన్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది.

ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్‌ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్‌ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్‌ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా సినిమా తెరకెక్కించారు.

మా బ్యానర్‌ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్‌ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్‌. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్‌. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్‌. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్‌’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్‌ ప్రసాద్‌ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్‌ రమేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top