టబు, సోనాలీలు తప్పించుకోవడానికి కారణమిదే!

No Eyewitness Evidence To Prove Tabu, Sonali Bendre In The Blackbuck Poaching Case - Sakshi

సాక్షి, జైపూర్ :  రాజస్థాన్ అడవుల్లో కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ జోధ్‌పూర్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్‌ నటులు సైఫ్‌ అలీ ఖాన్‌, సోనాలీ బ్రిందే, టబు, నీలంలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. కానీ ఆ రోజు సల్మాన్‌తో పాటు జీపులో సైఫ్‌, టబు, సోనాలీ, నీలంలు కూడా వున్నారని, వారే సల్మాన్‌ను తుపాకీతో కాల్చమని ప్రోత్సహించారని ప్రాసిక్యూషన్ ఆరోపించింది. అయితే వారికి వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకలేదు. ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన పూనమ్ బిష్ణోయ్.. జీపులో ఉన్నది వారేనా? అన్నది కచ్చితంగా చెప్పలేకపోయారు. దీంతో సైఫ్ అలీ ఖాన్, నీలమ్, టబు, సొనాలీ బింద్రేలను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 

వారితో పాటు ఈ క్రైమ్‌లో కీలక పాత్ర పోషించిన దుష్యంత్‌ సింగ్‌ను కూడా నిర్దోషిగానే కోర్టు ప్రకటించింది. క్రాస్‌ ఎగ్జామినేషన్‌ కోసం టబు, సోనాలీలను ఒక రోజు కోర్టు ముందుకు తీసుకొచ్చినప్పటికీ, పూనమ్‌ బిష్ణోయ్‌ వారిని గుర్తుపట్టలేకపోయారు. ఫిర్యాదులో వారి పేర్లను పేర్కొని, ఎందుకు అతను గుర్తుపట్టలేకపోతున్నారని కోర్టు ప్రశ్నించింది. అయితే ఘటన జరిగిన రోజు అందరూ తెలుపు రంగ సల్వార్‌ సూట్స్‌ ధరించారని, ఆ కారణంతో వారిని గుర్తించలేపోతున్నానని బిష్ణోయ్‌ తెలిపారు. దీంతో ఇక వారిని ధ్రువీకరించే ఆధారాలు లేనందున.. నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. వారు సల్మాన్‌ వెంట ఉన్నారే తప్పితే కృష్ణ జింకలను చంపడంలో పాత్ర ఏమీ లేదని వారి తరఫు న్యాయవాది వాదించడం కూడా టబు, సోనమ్‌, నీలమ్‌, సైఫ్ అలీ ఖాన్‌లకు కలిసి వచ్చింది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top