అసంతృప్తిలో నయన నిర్మాత

Nayanthara Movie Kolamavu kokila Sensor Cuts Issue - Sakshi

తమిళసినిమా: అగ్రనటి నయనతార. ఆమె చిత్రం అంటే వ్యాపారం పరంగా ఎలాంటి ఢోకా ఉండదు. ఇక ప్రేక్షకులు కూడా నయనతార చిత్రం అంటే ఎలాగున్నా మినిమం గ్యారెంటీ ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు. అలాంటిది ఆ నటి చిత్రంపై దర్శక నిర్మాతలు అసంతృప్తితో ఉండడం ఏమిటనేగా మీ సందేహం. ఆ కథేంటో చూసేద్దాం. నయనతార నటించిన లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో కొలమావు కోకిల ఒకటి. ఆమె డ్రగ్స్‌ స్మగ్లర్‌గా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. చిత్ర నాయకి డ్రగ్స్‌ స్మగ్లర్‌ పాత్రలో నటిస్తోందన్న సమాచారం బయటకు రాగానే కొలమావు కోకిల చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఇక నయనతార ప్రధాన పాత్ర పోషించిన చిత్రం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి.

చిత్రం టీజర్‌ ఇప్పటికే మార్కెట్‌లో సందడి చేస్తోంది. అందులో నయనతారను విపరీతంగా ఒన్‌సైడ్‌ చేసే హాస్యనటుడు యోగిబాబు పాత్రకు క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది. అంతా బాగానే ఉంది. సమస్య అంతా సెన్సార్‌బోర్డుతోనే. ఈ చిత్రం సెన్సార్‌కు వెళ్లగా పూర్తిగా చూసిన సభ్యులు నిర్ధాక్షణ్యంగా ఏ సర్టిఫికెట్‌ ఇచ్చేశారు. దీంతో చిత్ర వర్గాలకు షాక్‌. అయితే దర్శకుడు నెల్సన్‌ ఎలాగో సెన్సార్‌ సభ్యులతో పోరాడి యూ/ఏ సర్టిఫికెట్‌కు తీసుకొచ్చినట్లు సమాచారం. అదీ కొన్ని సన్నివేశాల కట్స్‌ తరువాతేనట. అయితే చిత్ర నిర్మాత మాత్రం ఈ విషయంలో చాలా అప్‌సెట్‌ అయ్యారని, కొలమావు కోకిలను రివైజింగ్‌ కమిటీకి తీసుకెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. ఆర్‌సీకి వెళ్లితే నయనతార చిత్రానికి యూ సర్టిఫికెట్‌ లభిస్తుందని నిర్మాత నమ్ముతున్నట్లు సమాచారం. మరి ఏం జరుగుతుందో చూద్దాం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top