నచ్చకపోతే...వెళ్లిపోతానన్నా!

నచ్చకపోతే...వెళ్లిపోతానన్నా! - Sakshi


‘కుమారి 21 ఎఫ్’ పేరుకు చిన్న సినిమా అయినా ప్రతి సన్నివేశం రిచ్‌గా, పెద్ద సినిమాలకు దీటుగా ఉంటుంది’’ అని ప్రముఖ కెమేరామన్ రత్నవేలు చెప్పారు. రాజ్‌తరుణ్, హేబా పటేల్ జంటగా సుకుమార్ నిర్మాతగా మారి కథ, స్క్రీన్‌ప్లే అందించిన చిత్రం ‘కుమారి 21ఎఫ్’. సూర్యప్రతాప్ పల్నాటి దర్శకుడు. ‘రోబో, 1-నేనొక్కడినే’  లాంటి భారీ చిత్రాలకు పనిచేసిన రత్నవేలు ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడు. నేడు రిలీజయ్యే ఈ చిత్రవిశేషాలు ఆయన మాటల్లోనే...

 

సుకుమార్‌తో నాది పదేళ్ల అనుబంధం. ఆయన ఈ కుమారి కథ చెబుతానన్నప్పుడు - ‘నచ్చితే చేస్తా. లేకపోతే చెన్నై వెళిపోతా’నన్నా. కానీ కథ విన్నాక వెంటనే ఓకే చెప్పేశా.  కథను నమ్మే సినిమాలు అంగీకరిస్తా గానీ అది చిన్నదా? పెద్దదా అనే తేడా లేదు. ‘రోబో’ చిత్రానికి వర్క్ చేశాక, తమిళంలో  ‘హరిదాస్’ అనే లో-బడ్జెట్ చిత్రానికి పనిచేశా.  కథానుగుణంగానే ఈ  చిత్రానికి రెగ్యులర్ లైటింగ్‌లో 80 శాతం వరకు తగ్గించి పనిచేశా. అందుబాటులో ఉన్న డిజిటల్ లోలైటింగ్ ఫొటోగ్రఫీని ప్రయోగాత్మకంగా వాడాం.

 

క్లయిమాక్స్ సన్నివేశం తక్కువ సంభాషణలతో హీరో హీరోయిన్ల భావోద్వేగాలను బేస్ చేసుకుని ఉంటుంది.  ఈ సినిమా కోసం పారితోషికం తీసుకోకుండా ఎందుకు పనిచేశావని చాలామంది అడుగుతున్నారు. 20 ఏళ్లుగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నా. ఇప్పటివరకూ సంపాదించింది చాలు. అందుకే నాకు అలాంటి పట్టింపులు ఉండవు. మంచి సినిమా అయితే చాలు.  ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న ‘బ్రహ్మోత్సవం’కి పనిచేస్తున్నా. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేయను. ఒక్క సినిమా అయినా నిబద్ధతతో చేయాలనేదే నా అభిప్రాయం.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top