గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు | Gopichand Tamanna New Film Launched in Hyderabad | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

Oct 4 2019 2:06 AM | Updated on Oct 4 2019 2:06 AM

Gopichand Tamanna New Film Launched in Hyderabad - Sakshi

తమన్నా, గోపీచంద్, బోయపాటి శ్రీను

‘‘శ్రీనివాస్, పవన్‌గార్లు నాకు చాలాకాలంగా తెలిసినా, వారితో తొలిసారి పని చేస్తున్నాను. మంచి సినిమా చేయాలనే తపన ఉన్న నిర్మాతలతో మంచి కథతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అని గోపీచంద్‌ అన్నారు. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కనున్న సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ‘యు టర్న్‌’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని అందించిన శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ బోయపాటి శ్రీను క్లాప్‌ ఇచ్చారు.

గోపీ చంద్‌ మాట్లాడుతూ– ‘‘గౌతమ్‌ నంద’ తర్వాత సంపత్‌ మంచి స్క్రిప్ట్‌తో వచ్చారు. తమన్నాతో ఫస్ట్‌ టైమ్‌ చేస్తున్నాను. తనది కూడా మంచి పాత్ర’’ అన్నారు. సంపత్‌ నంది మాట్లాడుతూ– ‘‘ఫస్ట్‌ టైమ్‌ క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేస్తున్నాను. ఆంధ్రా ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా గోపీగారు, తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా తమన్నా చేస్తున్నారు. చిట్టూరి శ్రీనివాస్, పవన్, శ్రీనివాస్‌గార్ల బేనర్‌లో పది కాలాల పాటు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. గోపీచంద్‌గారి ఫ్యాన్స్‌ గర్వంగా చెప్పుకునేలా ఉంటుంది’’ అన్నారు.

‘‘సంపత్‌గారితో నా మూడో సినిమా ఇది. గోపీచంద్‌గారితో సినిమా చేయాలని చాలారోజులుగా ఎదురు చూస్తున్నాను. నాది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర’’ అన్నారు తమన్నా. ‘‘అన్ని రకాల వాణిజ్య అంశాలున్న సినిమా ఇది. నవంబర్‌లో షూటింగ్‌ ఆరంభించి, ఏప్రిల్‌లో సినిమా విడుదలకి ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు శ్రీనివాసా చిట్టూరి. ఈ కార్యక్రమంలో చిత్రసమర్పకులు పవన్‌ కుమార్, నిర్మాతలు బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, అనిల్‌ సుంకర, కె.కె. రాధామోహన్,  దర్శకుడు ప్రశాంత్‌ వర్మ, కెమెరామేన్‌ సౌందర్‌ రాజన్, ఆర్ట్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement