తొలి సీడీ నాన్నకు ప్రేమతో


ఇటీవల కాలంలో ఇండస్ట్రీని తీవ్రంగా కదిలించిన మరణం ప్రముఖ సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తండ్రి జి. సత్యమూర్తిది. ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్న దేవీ శ్రీ తన ప్రతి సినిమాలో కుటుంబాన్ని కూడా భాగం చేసేవాడు. సంగీత దర్శకత్వంతో పాటు పాటల రచయితగానూ రాణిస్తున్న దేవీ వెనక తండ్రి ప్రోత్సాహం ఎంతో ఉంది. అందుకే తండ్రి కోరిక మేరకు ఆయన మరణం తరువాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా తిరిగి మ్యూజిక్ చేయటం మొదలు పెట్టాడు.



దేవి సినిమాతో సంగీత దర్శకత్వం మొదలు పెట్టిన దేవీ శ్రీ తన ప్రతి సినిమా తొలి ఆడియో సీడీని తన తల్లిదండ్రులకు ఇవ్వటం ఓ ఆనవాయితీగా పెట్టుకున్నాడు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నాన్నకు ప్రేమతో సినిమా ఆడియో రిలీజ్ సమయానికి తండ్రి లేకపోవటం దేవీ శ్రీని తీవ్రంగా బాధించింది. అయితే ఈ సారి కూడా తన ఆల్బమ్ తొలి సీడీని నాన్నకు ఇచ్చానంటూ ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు దేవీ శ్రీ. తండ్రి ఫోటో దగ్గర ఆడియో సీడీ ఉంచిన ఫోటో దేవీ అభిమానులతో పాటు తెలుగు సినీ అభిమానులను కదిలించింది.



ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భోగవళ్లి ప్రసాద్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top