శింబుతో సెట్‌ అవుతుందా?

Anushka Will Joins With Simbu For Gautham Menon Film - Sakshi

కోలీవుడ్‌లో ఒక కొత్త క్రేజీ కాంబినేషన్‌ను సెట్‌ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న నటుడు శింబు. లిటిల్‌స్టార్‌ నుంచి క్రేజీ స్టార్‌ స్థాయికి ఎదిగిన ఈయన ఇటీవల నటనకు చిన్న గ్యాప్‌ తీసుకున్నారనే చెప్పాలి. ఈ గ్యాప్‌లో లండన్‌ వంటి విదేశాలు చుట్టొచ్చారు. అదేవిధంగా సమీప కాలంలో సరైన హిట్‌ను అందుకోలేదన్నది వాస్తవం. ఇక వివాదాలు ఈయనకు కొత్త కాదు. నయనతారతో ప్రేమ, నటి హన్సికతో పెళ్లి దాదాపు ఖయం అనుకున్న సమయంలో రివర్స్‌ అవడం శింబును సంచలన నటుడిగా మార్చాయని చెప్పవచ్చు. కాగా కోలీవుడ్‌లో మోస్ట్‌ బ్యాచిలర్‌ అనిపించుకుంటున్న శింబు ప్రస్తుతం తన మాజీ ప్రియురాలు హన్సిక 50వ చిత్రంలో అతిథి పాత్రలో నటించి పూర్తి చేశారు. ప్రస్తుతం మానాడు చిత్రంలో నటిస్తున్నారు. (రాజ రాజ చోర’ అంటే దొంగలందరికీ రాజు లాంటివాడు అని అర్థం)

ఇక అందాలతార అనుష్క గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అగ్రనటిగా రాణిస్తున్న ఈ స్వీటీ చిత్రాల ఎంపికలో ఆచితూచి అడుగులేస్తోందనిపిస్తోంది. ఎక్కువగా హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రాలకే మొగ్గు చూపుతున్న అనుష్కను చివరిగా సైరా నరసింహారెడ్డి చిత్రంలో అతిథి పాత్రలో చూశాం. కాగా ఈ బ్యూటీ నటించిన సైలెన్స్‌ చిత్ర విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మాధవన్, నటి అంజలి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 2న తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. కాగా తరువాత చిత్రం ఏమిటన్న ప్రశ్న ఆసక్తిగా మారింది. ఎందుకంటే అనుష్క ప్రేమలో పడిందని, త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశం ఉందనే ప్రచారం జోరందుకుంది. కాగా ఈ అమ్మడు చాలా కాలం క్రితమే దర్శకుడు గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నటించడానికి అంగీకరించినట్లు చెప్పింది.

అయితే ఆ తరువాత ఆ చిత్రం గురించి ఎలాంటి సమాచారం లేదు. కాగా దర్శకుడు గౌతమ్‌మీనన్‌ ప్రస్తుతం నటుడిగా బిజీ అయ్యారు. అయితే దర్శకత్వానికి దూరం అవుతానని చెప్పలేదు. అంతేకాదు తదుపరి చిత్రానికి ప్రయత్నాలు మొదలెట్టారట. దీని గురించి ఆయన ఒక ఇంటర్వ్యూలో పే ర్కొంటూ విన్నైతాండి వరువాయా చిత్ర సీక్వెల్‌కు కథను రెడీ చేసినట్లు చెప్పారు. ఆయన దర్శకత్వంలో శింబు, త్రిష నటించిన విన్నైతాండి వరువాయా చిత్రం ఎంత సంచలన విజయాన్ని సాధించిందో తెలిసిందే. (శింబు సినిమాలో విలన్‌గా సుదీప్‌)

అదే చిత్రం తెలుగులో నాగచెతన్య, సమంత నటించగా ఏం మాయ చేసావే పేరుతో విడుదలై అక్కడ అనూహ్య విజయాన్ని అందుకుని నటి సమంతకు కొత్త భవిష్యత్తును ఇచ్చింది. కాగా ఇప్పుడు విన్నైతాండి వరువాయా చిత్రానికి సీక్వెల్‌ను చేయడానికి గౌతమ్‌మీనన్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో నటుడు శింబును రిపీట్‌ చేయాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అదే విధంగా ఆయనకు జంటగా నటి అనుష్క అయితే బాగంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ అవుతుందా అన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇకపోతే శింబు, అనుష్క ఇంతకు ముందు ‘వానం’ చిత్రంలో నటించారన్నది గమనార్హం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top