మరో రోజు.. క్యూలోనే.. | Retail businesses in the shutdown problem | Sakshi
Sakshi News home page

మరో రోజు.. క్యూలోనే..

Nov 18 2016 4:34 AM | Updated on Sep 22 2018 7:51 PM

మరో రోజు.. క్యూలోనే.. - Sakshi

మరో రోజు.. క్యూలోనే..

పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్య జనాన్ని మరింతగా ముసురు కుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి.

నోట్ల మార్పిడి కోసం జనానికి తప్పని అవస్థలు
- ఇంకా అందుబాటులోకి రాని రూ.500 నోట్లు
- బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల వద్ద బారులు తీరుతున్న జనం
- చిల్లర సమస్యతో వ్యాపారాలు బంద్
- కార్డు స్వైపింగ్ యంత్రాల కోసం వ్యాపారుల అర్జీలు
 
 సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు కష్టాలు సామాన్య జనాన్ని మరింతగా ముసురు కుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా వ్యాపారాలు స్తంభించిపోయాయి. దినసరి కూలీలు మొదలు చిరు వ్యాపారులు, ఉద్యోగులు, వృద్ధులు, మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. షాపింగ్ మాల్స్, కార్పొరేట్, బడా వ్యాపార, వాణిజ్య సంస్థలన్నీ వెలవెలబోరుు కనిపిస్తున్నాయి. గురువారం కూడా బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎం సెంటర్ల వద్ద జనం బారులు తీరారు. కొత్త రూ.500 నోట్లు ఇంకా రాకపోవడం, ఏటీఎంలలో సాఫ్ట్‌వేర్ మార్చి కొత్త నోట్లను అందుబాటులో ఉంచకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. ఏటీఎంలలో నగదు నిల్వచేసిన గంట, రెండు గంటలలోపే అరుుపోతున్నాయి. పలు జాతీయ బ్యాంకులు నగదు మార్పిడి కోసం వచ్చే వారికి సిరా చుక్క పెడుతున్నా.. పలు ప్రైవేటు బ్యాంకులు ఇంకా ఆ పని చేయకపోతుండడంతో కొందరు మళ్లీ, మళ్లీ క్యూ కడుతున్నారు. దీంతో అవసరమున్న వారికి నగదు అందడం లేదు. బ్యాంకర్లు వేలికి పెడుతున్న సిరా చుక్క కూడా సులువుగానే తుడిచివేయవస్తోందని పలువురు పేర్కొంటున్నారు.

 చిల్లర కోసం కష్టాలు: బ్యాంకుల్లో ఇస్తున్న రూ.2 వేల కొత్త నోట్లు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. నిత్యావసరాలు, పళ్లు, పాలు, కూరగాయల కోసం ఈ నోటుతో వెళితే వ్యాపారులు చిల్లర లేదంటూ తిప్పి పంపుతున్నారు. మాల్స్‌లోనూ రూ.2 వేల కొత్త నోటుతో వెళితే రూ.1,500 మేర కొనుగోలు చేయాల్సిందేనని నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని దుకాణాల్లో క్రెడిట్, డెబిట్ కార్డులను స్వైప్ చేసిన వారి నుంచి బిల్లుపై నాలుగు శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక చిల్లర అందుబాటులో లేకపోవడంతో పలువురు చిరు వ్యాపారులు, దుకాణదారులు స్వైపింగ్ యంత్రాలు జారీ చేయాలని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మరోవైపు పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారులకే నగదు మార్పిడి చేస్తుండడం, మరికొన్ని బ్యాంకుల్లో మధ్యాహ్నం వరకే నగదు మార్పిడికి అనుమతించడంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల నల్లధనాన్ని వైట్‌గా మార్చుకునేందుకు బడాబాబులు కూలీలను వారి ఆధార్‌కార్డుతో సహా తీసుకొచ్చి క్యూలైన్లలో నిలబెడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 ముత్యాల వ్యాపారంపైనా ఎఫెక్ట్
 పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్ పాతబస్తీలోని బంగారం, వెండి, ముత్యాల వ్యాపారాలను తీవ్రంగా దెబ్బతీసింది. బంగారు ఆభరణాలు తయారు చేసే కార్మికులు, స్వర్ణకారులు పనిలేక ఇబ్బందులకు గురవుతున్నారు. నోట్ల రద్దుతో అడ్డాకూలీలు సైతం పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక దీనంగా కాలం వెల్లదీస్తున్నారు. ప్రతి గురువారం జరిగే జుమ్మెరాత్‌బజార్ సంత కొనుగోలుదారులు లేక వెలవెలబోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement