కుత్బుల్లాపూర్‌ కాల్పుల సూత్రధారి హత్య | Quthbullapur gunfire case accused brutally murdered | Sakshi
Sakshi News home page

కుత్బుల్లాపూర్‌ కాల్పుల సూత్రధారి హత్య

Jan 13 2017 2:37 AM | Updated on Sep 5 2017 1:06 AM

కుత్బుల్లాపూర్‌ కాల్పుల సూత్రధారి హత్య

కుత్బుల్లాపూర్‌ కాల్పుల సూత్రధారి హత్య

రాజధాని కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్‌ కాల్పుల ఘటన సూత్రధారి శైలేందర్‌ అలియాస్‌ చక్రవర్తి(40) దారుణ హత్యకు గురయ్యారు.

పిలిపించి కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు
హైదరాబాద్‌ పేట్‌బషీర్‌బాద్‌ పీఎస్‌ పరిధిలో ఘటన
రియల్‌ ఎస్టేట్‌ వివాదాలే కారణం


హైదరాబాద్‌: రాజధాని కుత్బుల్లాపూర్‌లోని పద్మానగర్‌ కాల్పుల ఘటన సూత్రధారి శైలేందర్‌ అలియాస్‌ చక్రవర్తి(40) దారుణ హత్యకు గురయ్యారు. రియల్‌ ఎస్టేట్‌లో తలెత్తిన వివాదంతో ప్రత్యర్థులు పథకం ప్రకారం అతడిని ఘోరంగా నరికి చంపారు. పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఈ హత్య కలకలం రేపింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలివి... ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన చక్రవర్తి కొన్నేళ్ల నుంచి కుత్బుల్లాపూర్‌ పద్మానగర్‌ రింగ్‌రోడ్డు సమీపంలో ఉంటున్నాడు. జులాయిగా తిరిగే చక్రవర్తి రియల్‌ వ్యాపారంలోకి దిగి పలువురితో ప్లాట్ల విషయంలో సెటిల్‌మెంట్లు చేస్తూ గొడవలు పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే నాగేందర్‌రెడ్డితో విభేదాలు వచ్చాయి. నాగేందర్‌రెడ్డిని హత మార్చాలని పథకం పన్నిన చక్రవర్తి 2016, నవంబర్‌ 16 రాత్రి 10 గంటల సమయంలో పద్మానగర్‌లో అనుచరుడు సాయిప్రభుతో అతడిపై కాల్పులు జరిపించాడు. ఈ కేసులో అరెసై్ట ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న చక్రవర్తి... నాగేందర్‌రెడ్డిని ఎలాగైనా హతమారుస్తానని చెప్పేవాడని స్థానికులు తెలిపారు.

హతమార్చి.. లొంగిపోయిన నిందితులు..
చక్రవర్తిని పథకం ప్రకారం నాగేందర్‌రెడ్డి వర్గీయులు గురువారం పద్మానగర్‌ రింగ్‌ రోడ్డు చాయిస్‌ ఫ్యాక్టరీ వద్దకు పిలిపించి గొడవకు దిగారు. నాగేందర్‌రెడ్డి అనుచరులు రాంబాబు, అప్పారావుతో చక్రవర్తి గొడవ పడుతుండగా... వేచి చూస్తున్న నాగేందర్‌రెడ్డి, నాగయ్య, రవి వెంట తెచ్చుకున్న రాడ్లతో చక్రవర్తి తలపై బలంగా కొట్టారు. అనంతరం కొబ్బరి బోండాలు కొట్టే కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ప్రాణం పోయిందని తెలుసుకున్న తరువాత వారు నేరుగా పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయినట్లు తెలిసింది. బాలానగర్‌ డీసీపీ సాయిశేఖర్, పేట్‌బషీరాబాద్‌ ఏసీపీ శ్రీని వాస్‌రావు, సీఐ రంగారెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement