కీలక జీవోలో అన్నీ తప్పులే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అధికారిక ఉత్తర్వులు తప్పుల తడకగా ఉంటున్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం గజ్వేల్‌కు సంబంధించిన ఉత్తర్వులోనూ ఇదే జరిగింది. గజ్వేల్‌లో ప్రస్తుతం 50 పడకల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఉంది. దీన్ని 100 పడకల సామర్థ్యానికి పెంచేందుకు అనుమతిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ ఉత్తర్వులు జారీ చేశారు. హెల్త్‌ సెంటర్‌ అభివృద్ధి చేసేందుకు రూ.21 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. అయితే ఈ ఉత్తర్వులో అన్ని విషయాలూ తప్పుగానే ఉన్నాయి.

గజ్వేల్‌ మెదక్‌ జిల్లాలో ఉందని పేర్కొన్నారు. ఉత్తర్వులో మరికొన్ని తప్పులు చేశారు. గజ్వేల్‌ జిల్లాగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఉత్తర్వు కాపీని ఎవరెవరికి పంపిస్తారనే విషయం కాపీలోనే పొందుపరుస్తారు. గజ్వేల్‌ హెల్త్‌ సెంటర్‌ అభివృద్ధి ఉత్తర్వులో... దీని కాపీని గజ్వేల్‌ జిల్లా కలెక్టర్‌కు, గజ్వేల్‌ జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్తకు, గజ్వేల్‌ జిల్లా వైద్యాధికారికి, గజ్వేల్‌ జిల్లా ట్రెజరీకి పంపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలా కీలకమైన జీవోలో అన్ని తప్పులే ఉండటం అందరినీ విస్మయానికి గురి చేసింది. 

Read latest Hyderabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top