పల్లవ రాజు... పండిత నెహ్రూ

Meeting Completed Between Modi And Jinping - Sakshi

జనతంత్రం

ఆసియా ఖండంలోని ఇద్దరు శక్తిమంతమైన నాయ కులు నరేంద్ర మోదీ, షీ జిన్‌ పింగ్‌ల ‘వ్యూహాత్మక’ సమావేశం ముగిసింది. సంయుక్త ప్రకటన వంటిది ఏమీ ఉండదని ముందుగానే చెప్పారు కనుక, ఏ అంశాల మీద వారిద్దరి మధ్యన చర్చలు జరిగి వుంటాయన్న దానిపై సహజంగానే ఆసక్తి వుంటుంది. ఆ ఆసక్తిని మించి, సగటు భారతీయుడి హృదయాన్ని రంజింప జేసే మరో ఆకర్షణీయ దృశ్యం ఈ సమావేశాల్లో ఆవిష్కృ తమైంది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత శక్తిమంతుడి కింద లెక్క. ఆ తర్వాతి స్థానం చైనా అధ్యక్షుడైన జిన్‌ పింగ్‌దే. ఆయన మనదేశం వచ్చారు. మన ప్రధానితో కలిసి సమావేశమయ్యారు. ఇద్దరూ కలిసి భారతీయ శిల్పకళా సొగసులను తిలకించారు. సంగీత నాట్యాలను ఆస్వా దించారు. ఆలయాల వెలుపల కలయదిరుగుతూ టీవీల ద్వారా ప్రజలకు కనువిందు చేశారు. ఒక రాజును గొప్ప వాడిగా పరిగణించడానికి చాణక్యుడు నిర్దేశించిన ప్రమా ణాల్లో పొరుగు రాజులకంటే బలంగా కనిపించడం కూడా ఒకటి. నిన్నటి సమావేశం సందర్భంగా నరేంద్ర మోదీ ఆహార్యం, ఆంగికవాచకం చాణక్యుడు నిర్దేశించిన ప్రమాణాలకు సరిపోతాయి. మామల్లపురంలో పల్లవుల కాలంనాటి ఏకశిలా రథాల ముందు తమిళ సంప్రదాయ వస్త్రధారణతో, ఎడమ భుజంపై వున్న ఉత్తరీయం వెనుక భాగాన్ని కుడి ముంజేతిపై వేసుకొని జిన్‌ పింగ్‌ ఎదుట రాజసంగా కనిపించిన విధానం దేశ ప్రజలను కచ్చి తంగా ఆకర్షించి ఉంటుంది. మన సినిమాలు, నాటకాల్లో చక్రవర్తులు, రాజాధిరాజుల పాత్రలు ఈ భంగిమలోనే కనిపిస్తాయి. అంతర్జాతీయ వేదికలపై ఇతర దేశాల నాయకుల నడుమ మన నాయకుడు ప్రత్యేకంగా, కీల కంగా కనిపించాలని దేశ ప్రజలు బలంగా కోరుకుం టారు. ఎందుకంటే ఆ నాయకుడు ఆ వేదికపై మన దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక. దక్షిణాసియా దేశాలు, అలీన దేశాలు వంటి పరిమిత స్థాయి వేదికలపై తప్ప, సంపన్న దేశాలు పాల్గొనే విస్తృత వేదికపై కొన్ని దశాబ్దాలుగా మన నాయకులు నిరాశపరుస్తూనే వున్నారు. ఇన్నాళ్లూ ఒకటి... ఇప్పుడొకటి అన్నట్టుగా నరేంద్ర మోదీ ఆ సంప్రదాయానికి చరమగీతం పాడారు. మూడు నెలల కిందటి ఆ గేమ్‌ చేంజర్‌ దృశ్యాన్ని బహుశా ఎప్పటికీ మరిచిపోలేమేమో. అసలే కోతి, ఆపై కల్లు తాగింది... అని సామెత చెప్పినట్టు అసలే ట్రంపు... ఆపై అమెరికా అధ్యక్షుడు. అతనితో వ్యవహారం అంటే మాటలా? ఉమ్మడి మీడియా సమా వేశంలో ఆకతాయిగా వ్యవహరించబోయిన ట్రంప్‌ చేతిపై తన ఎడమ చేత్తో చరిచి చాల్లే బడాయని ఒక భారత నేత అదుపు చేయడం గతంలో ఊహలకు కూడా అందని దృశ్యం. ఈ దృశ్యం సగటు భారతీయుని హృద యాన్ని సమ్మోహితం చేసింది. అతని ఆత్మగౌరవాన్ని ఉత్తేజ పరిచింది.

అంతర్జాతీయ వ్యవహారాల్లో భారతదేశానికి సంబంధించినంత వరకు ఈ గాలి మార్పు ఎలా సాధ్య మైంది? మన కోటీశ్వరులు, అంతర్జాతీయ కోటీశ్వ రులతో పోటీపడుతూ ఫోర్బ్స్‌ జాబితాల్లోకి క్రమం తప్ప కుండా ఎక్కుతున్నందుకా? కాదు. మన ప్రభుత్వాలు అద్భుతాలు సృష్టించి ఆర్థికాభివృద్ధిని శరవేగంగా పరు గెత్తిస్తున్నందుకా?... కాదు. మన రక్షణ పాటవం అమాంతం పెరిగిపోయి, పొరుగుదేశాలు వణికిపోతు న్నందుకా? కానేకాదు. ప్రపంచంలో ఇప్పుడు భారత్‌కు లభిస్తున్న గౌరవం ఆ దేశపు మధ్య తరగతి మంద హాసం. వినిమయ వస్తువులను కొనుగోలు చేయగలిగిన మధ్య – ఉన్నత మధ్యతరగతి జనాభా దేశంలో 30 కోట్లు దాటింది. ఈ జనాభా నానాటికీ పెరుగుతున్నది. దాదాపు అమెరికా జనాభాతో సమానంగా భారత్‌లో ఒక కొనుగోలు మార్కెట్‌ తయారై వుంది. గనిలో, వనిలో, కార్ఖానాల్లో విరామ మెరుగక శ్రమించిన ముందుతరం త్యాగధనుల స్వేదంలోంచి కొత్త మధ్య తరగతి ఉద్భవించింది. పాడిపంటల్లో కాయకష్టం చేసిన లక్షలాది మంది తల్లుల కొంగుముడుల్లో దాగిన పొదు పులోంచి పుట్టుకొచ్చిన నయా మధ్యతరగతి ఉపాధివే టలో దేశదేశాలకు విస్తరించింది. విదేశాల్లో తమ అవసరాలను కుదించుకొని మాతృదేశానికి ఏటా లక్షల కోట్లు పంపిస్తూ ప్రవాస భారతీయులు భారతీయ వినిమయ మార్కెట్‌ను పటిష్టపరుస్తున్నారు. ఈ మార్కెట్‌ అంటే అమెరికాకు గౌరవమే, చైనాకూ గౌరవమే, వస్తు వులు అమ్ముకునే ప్రతిదేశానికీ గౌరవమే. ఈ మార్కె ట్‌ను పరిపాలిస్తున్న భారత ప్రభుత్వమంటే కూడా గౌరవమే ఉండితీరాలి. శరీరకష్టం పునాదిగా నిర్మితమైన భారత మధ్యతరగతి ఆత్మగౌరవ ఆకాంక్షలకు అనుగు ణంగానే అంతర్జాతీయ వేదికలపై మన చాయ్‌వాలా ప్రధాని వ్యవహరిస్తున్నారని భావించవచ్చు.

ఇంతకూ మోదీ – జిన్‌ పింగ్‌ ఏ విషయాలపై సీరి యస్‌గా చర్చించి వుంటారు? ఏ దేశానికైనా దీర్ఘకాలిక లక్ష్యాలు వేరు. తాత్కాలిక వ్యూహాలు వేరు. ఇందుకు భారత్, చైనాలు కూడా మినహాయింపు కాదు. అమె రికాను అధిగమించి అగ్రరాజ్యంగా ఎదగాలన్న కోరిక చైనాకు వున్నది. కోరిక వుండటమే కాదు.. అది నెర వేర్చుకునేందుకు చాలాకాలంగా ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నది. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకున్నది. అంతర్జాతీయ వర్తక వాణిజ్యాల్లో అమెరికాకు సవాల్‌ విసురుతున్నది. అందుకు ప్రతిగా చైనాను అదుపు చేసేం దుకు భారత్‌ సహాయాన్ని అమెరికా ఆశిస్తున్నది. తాను ఏర్పాటు చేసే ఇండో–పసిఫిక్‌ కూటమిలో భారత్‌ భాగం కావాలన్నది అమెరికా కోరిక. ఇది వాస్తవరూపం దాలిస్తే ఈ ప్రాంతంలో చైనా దూకుడుకు కళ్లెం పడుతుంది. కానీ, అమెరికా చెప్పుచేతుల్లో వుండటానికి భారత్‌ కూడా అంగీకరించదు. ప్రపంచ శక్తిగా ఎదగాల్సిన అవసరం, అవకాశం భారత్‌కు కూడా వున్నాయి. ఈ ప్రాంతంలో అమెరికా పెత్తనమయినా, చైనా ఆధిపత్య మైనా, భారత్‌ సహించే అవకాశమే లేదు. కనీసం దక్షి ణాసియా వరకైనా తన మాట చెల్లుబాటు కావాలన్న లక్ష్యం భారత్‌కు వుంది. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ నుంచి చైనా–పాక్‌ ఎకనామిక్‌ కారిడార్‌ను చైనా ఏర్పాటు చేసింది. ఇది భారత ప్రయోజనాలకు వ్యతిరేకం. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో భారత్‌ దూకుడుగా వ్యవహరించడం చైనాకు సమ్మతం కాదు. రెండు దేశాల మధ్యన 3,800 కిలోమీటర్ల పొడవున వున్న సరిహద్దుపై పేచీలు కూడా ఇప్పుడప్పుడే పరిష్కారమయ్యే సమస్యకాదు. భారత్‌– చైనాల మధ్య వర్తకం ఏటా రూ. ఏడు లక్షల కోట్లకు చేరు కున్నది. ఇందులో భారత్‌ నష్టపోతున్నది. చైనా ఎగుమ తులు ఐదు లక్షల కోట్లకిమ్మత్తు చేస్తుంటే భారత్‌ ఎగు మతులు (హాంకాంగ్‌తో సహా) రెండు లక్షల కోట్లు దాట డం లేదు. ఈ వ్యత్యాసాన్ని తగ్గించుకోవాలని భారత్‌ కోరుకుంటున్నది. ఇందుకోసం భారత్‌ ఎగుమతులకు చైనాలో మరిన్ని అవకాశాలివ్వాలని అడుగుతున్నది. భారత్‌లో భారీ పెట్టుబడులు పెట్టే అవకాశం లభించా లని చైనా కోరుకుంటున్నది. బహుశా ఈ రెండు అంశాల మీద కొంత పురోగతి వుండే అవకాశం వుంటుంది.

భారత్‌–చైనాల దీర్ఘకాలిక లక్ష్యాలు రెండు దేశాల మధ్య సంపూర్ణ స్నేహ సంబంధాలకు అవకాశం ఇవ్వక పోవచ్చు. ఆర్థిక అవసరాల దృష్ట్యా తాత్కాలికంగా కొన్ని విషయాలపై రాజీ పడవచ్చు. మసూద్‌ అజహర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలన్న భారత్‌ డిమాండ్‌కు అడ్డు తగులుతున్న చైనా దాన్నుంచి పక్కకు తప్పుకోవడం ఈ తాత్కాలిక వ్యూహంలో భాగంగానే చూడాలి. ఈ శతాబ్దాన్ని ఆసియా శతాబ్దంగా పరిగణి స్తున్నారు. కనుక ఆసియాలో ఎవరు సూపర్‌ పవర్‌ అవుతారో వారే సూపర్‌ గ్లోబల్‌ పవర్‌ కావచ్చు. అవ కాశం రెండు దేశాలకూ వున్నది. అందువల్ల ఒకరికి ఒకరు సంపూర్తిగా సహకరించుకొని మానవాళికి ఆద ర్శంగా మిగిలిపోతారని భ్రమించడం అవివేకమే అవు తుంది. 1962లో జరిగిన భారత్‌–చైనా యుద్ధానికి సంబంధించి ఇటీవల సీఐఏ కొన్ని పత్రాలను బయట పెట్టింది. వాటి ఆధారంగా అప్పటి చైనా ప్రధాని చౌ ఎన్‌ లై పండిత్‌ నెహ్రూను నమ్మించి గొంతుకోశాడని అది అభిప్రాయ పడింది. సామ్రాజ్యవాద దేశాలకు వ్యతిరే కంగా ఆఫ్రో– ఆసియా దేశాలు సంఘటితంగా పని చేయాలని నెహ్రూ భావించాడు. ఈ ప్రయాణంలో చైనాను నమ్మకమైన మిత్రదేశంగా భావించాడు. స్వాప్ని కుడు, ఆదర్శవాది అయిన నెహ్రూ ‘హిందీ–చీనీ భాయి భాయి’ అంటూ పులకించిపోయేవాడు. భారత్‌తో చైనా స్నేహం నటిస్తూనే యుద్ధ సన్నాహాలు పూర్తి చేసింది. యుద్ధానికి దారి తీయవలసినంత తీవ్రమైన పరిస్థితులు అప్పుడు లేవు. కానీ చైనా అంతరంగం మరొక విధంగా వున్నది. భారత్‌ను బలహీన దేశంగా ప్రపంచం ముందు చిత్రించడం ద్వారా మాత్రమే చైనా ప్రయోజనాలు నెర వేరగలవని ఆలోచించింది. ఈ విషయంపై యుద్ధం తర్వాత చైనా అధ్యక్షుడు లీ షావో చీ స్వీడన్‌ రాయబా రితో మాట్లాడుతూ భారత్‌కు గుణపాఠం నేర్పడానికే యుద్ధం చేశామని స్వయంగా చెప్పినట్టు ఈ పత్రాల్లో వెల్లడైంది. ఊహించని యుద్ధం కారణంగా భారత్‌ దారుణ పరాభవంపాలు కావలసివచ్చింది. నెహ్రూకు నమ్మకద్రోహం చేసిన చౌ ఎన్‌ లై కూడా మామల్లపురా నికి 1956 డిసెంబర్‌లో వచ్చారు. ఆ తర్వాత కొంతకాలా నికే చైనా భారత్‌పై దాడి చేసింది. ఇప్పుడు చైనా ప్రభుత్వం కూడా జిన్‌పింగ్‌ పర్యటనకు మామల్లపురాన్ని స్వయంగా ఎంపిక చేసినట్టు సమాచారం.

ఈ మహాబలిపురానికి చైనాకు రెండువేల ఏళ్లుగా సంబంధాలున్నాయి. పల్లవ రాకుమారుడొకరు ధర్మ ప్రబోధి అనే పేరుతో చైనాకు వెళ్లి అక్కడ షావోలిన్‌ మొనాస్టరీని స్థాపించి ధ్యాన బౌద్ధాన్ని బోధించాడు. మార్షల్‌ ఆర్ట్స్‌ను కూడా చైనీయులకు ధర్మప్రబోధుడే పరిచయం చేశాడని చెబుతారు. పల్లవరాజ్యం నుంచి చైనా దేశానికి భారీగా ఎగుమతులు జరిగేవని చెప్పడా నికి సాక్ష్యంగా మామల్లపురం రేవులో విస్తృతంగా ఆ కాలం నాటి చైనా నాణేలు దొరికాయి. మొదటి నర సింహవర్మ కాలంలో పల్లవరాజ్యం ఉచ్ఛదశను చూసింది. ఆ కాలంలోనే చైనాతో వర్తక వ్యాపారాలు వర్థి ల్లాయి. ఎగుమతులదే పైచేయిగా వుండేది. చౌ ఎన్‌ లై వచ్చివెళ్లిన 63 ఏళ్ల తర్వాత మరో చైనా నేత షీ జిన్‌ పింగ్‌ మామల్లపురం దర్శించి వెళ్లారు. ఇప్పుడేమవుతుంది? మరోసారి మోసపోవడానికి నెహ్రూలాగ స్వప్న లోకాల్లో విహరించే రకంకాదు నరేంద్ర మోదీ. చైనాకు ఎగుమతు లను పెంచి, వర్తకంలో లాభాలు పిండి నయా పల్లవ రాజు నరసింహవర్మ అవుతాడేమో చూడాలి.


muralivardelli@yahoo.co.in
వర్ధెల్లి మురళి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top