
మహిళా చెంఘిజ్ఖాన్
మతం వేరు. జాతి వేరు. సంస్కృతి వేరు. ఈ దేశపు మట్టిలో, నీటిలో, గాలిలో, సూర్యరశ్మిలో నాకు సమాన భాగమున్నట్టే ఈ సంస్కృతిలోనూ ఉంది.
మతం వేరు. జాతి వేరు. సంస్కృతి వేరు. ఈ దేశపు మట్టిలో, నీటిలో, గాలిలో, సూర్యరశ్మిలో నాకు సమాన భాగమున్నట్టే ఈ సంస్కృతిలోనూ ఉంది. నేను హోలీకి రంగులు అడితేనూ, దీపావళికి దీపాలు పెడితేనూ నా మత విశ్వాసాలు భంగమవుతాయా?
- ఇస్మత్ చుగ్తాయ్
వారి సంఖ్య తక్కువే కావచ్చు. కానీ అక్షరాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడంలో పురుషుల కంటే మహిళలు ఎక్కువ విజయం సాధించారని అనిపిస్తుంది. మగవారిలా మేధస్సుతో కాదు, హృదయంతో రచన చేయడం వారికే సాధ్యం. ఉర్దూ సాహిత్యంలో శిఖరాయమానమైన ఇస్మత్ చుగ్తాయ్ (ఆగస్ట్ 15, 1915- అక్టోబర్ 24,1991) ఇందుకు గొప్ప ఉదాహరణ. చుగ్తాయ్ సంస్కార ధోరణి కలిగిన ముస్లిం కుటుంబంలోనే పుట్టింది. ఆమెకు పర్షియన్ నేర్పించడానికి ఇంట్లో జరిగిన ప్రయత్నం సాగలేదు. ఈ విషయంలో పెద్దతండ్రి మీద కూడా ఆమె తిరుగుబాటు చేశారు. బహుశా ఇదే మొదటి తిరుగుబాటు అయి ఉంటుంది. చుగ్తాయ్కి వంటపని ఇంటి పని ఏమాత్రం సరిపడేది కాదు. వంటింటికే పరిమితం కావడం ఎంతమాత్రం సరికాదని ఏడెనిమిది దశాబ్దాల నాడే భావించిన భావుకురాలు.
పుస్తకాలంటే ప్రాణం. ఈ ధోరణి చూసిన తల్లికి కడుపు మండిపోయేది. అలీగడ్ మిషనరీ స్కూల్లో చేర్చించడం దగ్గర కూడా పెద్ద అల్లరే అయింది. చదువు కొనసాగించకుంటే ఇంట్లోంచి పారిపోతానని బెదిరించి మరీ స్కూల్లో చేరారు ఇస్మత్. పదిమంది సంతానంలో ఈ ఒక్క అమ్మాయే ఇలాంటి తిరుగుబాటు ధోరణి ప్రదర్శించడం ఆ తల్లిని కలచి వేసేది. కానీ తండ్రి, ఒక సోదరుడి మద్దతు ఉండేది. ముస్లింల ఇంట పుట్టినా ఆమె ఆ ఆచారాలు పాటించడానికి అంగీకరించలేదు. ఇస్లాం ఆచారాలను పరిపూర్ణంగా పాటించే ఆగ్రా వంటి చోటకు వెళ్లినా బుర్ఖా ధరించలేదు. చాలామందికి ఇష్టం లేకున్నా బీఏ, తరువాత ఆగ్రాలో బీటీ కూడా పూర్తి చేసిందామె.
దేశంలో బీటీ పట్టా తీసుకున్న తొలి మహిళ చుగ్తాయ్. ఆగ్రాలో చదువుకుంటున్నప్పుడే అక్కడ మాస్టర్స్ డిగ్రీ చదువుతున్న షాహిద్ లతీఫ్తో పరిచయమైంది. అది ప్రణయంగా మారి, వివాహం చేసుకున్నారు. షాహిద్ సినిమారంగంలో ఉండేవారు. ఇది కూడా వారి సంప్రదాయ కుటుంబానికి నచ్చలేదు. ముఖ్యంగా చిన్నతనం నుంచి అండగా నిలబడిన సోదరుడు ఆజీమ్ బేగ్ వ్యతిరేకించడం చిత్రం. రష్యన్ రచయితలను, ఇంగ్లిష్ రచయితలను అపారంగా చదివిన ఇస్మత్కు రచనలు చేయాలన్న ఆలోచన ఆజీమ్ను చూశాకే వచ్చింది. ఆనాటికే అతడు రచయిత. అయితే ఆమె రచనకు ఒక దృక్పథం ఏర్పడడానికి కారణం- 1936లో జరిగిన లక్నో అభ్యుదయ రచయితల సమావేశం.
ఉర్దూ మహా రచయిత మున్షీ ప్రేమ్చంద్ రోజులను లెక్కిస్తూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశమే భారతీయ సాహిత్యానికి కొత్త దిశను చూపించింది. ఎన్నో నవలలు, కథలు, రేడియో నాటికలు రాశారామె. ‘జిద్ది’, ‘తేడీ లకీర్’, ‘ఏక్బాత్’, ‘మాసూమా’, ‘దిల్ కీ దరియా’, ‘ఏక్ ఖత్రా ఏ ఖూన్’, ‘ఇన్సాన్ ఔర్ ఫరిష్టే (నవలలు, నవలికలు); ‘ధనీ బాంకే’, షైతాన్ (నాటికలు, రేడియో నాటికలు), ‘కలియా’, ‘దో హాథ్’, ‘చోటే’(కథా సంకలనాలు), ‘కాగజి హై పైరహన్’ (ఆత్మకథ) ఆమె రచనలలో కొన్ని. గరం హవా, అర్జూ, మైడ్రీమ్స్, లీహాఫ్ ఆమె కథల ఆధారంగా తీసిన చిత్రాలే.
రచయిత్రిగా చుగ్తాయ్ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిందో చెప్పడానికి ఒక్క ‘లిహాఫ్’ కథ చాలు. ఈ కథే ఆమెను బోను కూడా ఎక్కించింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అశ్లీలత ఆరోపణతో లాహోర్ కోర్టులో కేసు నడిపింది. ఆమెతో పాటు మరో కథ కారణంగా అప్పుడే విచారణను ఎదుర్కొన్న రచయిత సాదత్ హసన్ మంటో. ఇద్దరూ కేసుల నుంచి బయటపడ్డారు. మిత్రులయ్యారు. తన జ్ఞాపకాలకు అక్షరరూపం ఇస్తూ చుగ్తాయ్ రాసిన ఈ కాసిన్ని వాక్యాలు చదవడం ఒక గొప్ప అనుభవం. ‘నేను ముస్లిమ్ని. విగ్రహారాధన మాకు పాపం. కానీ పురాణాలనేవి ఈ దేశపు వారసత్వ సంపద. యుగాల సంస్కృతీ, తత్వమూ అందులో మిళితమై ఉన్నాయి.
మతం వేరు. జాతి వేరు. సంస్కృతి వేరు. ఈ దేశపు మట్టిలో, నీటిలో, గాలిలో, సూర్యరశ్మిలో నాకు సమాన భాగమున్నట్టే ఈ సంస్కృతిలోనూ ఉంది. నేను హోలీకి రంగులు అడితేనూ, దీపావళికి దీపాలు పెడితేనూ నా మత విశ్వాసాలు భంగమవుతాయా? నా విశ్వాసాలూ, వివేకమూ అంత తేలిగ్గా దెబ్బతినేటంత బలహీనమైనవా?’(అను: పి. సత్యవతి)మరో ప్రముఖ ఉర్దూ రచయిత్రి కురుతులన్హైదర్ మిత్రురాలి మీద తమాషా అయిన వ్యాఖ్య చేసింది. ఇస్మత్ చుగ్తాయ్ ‘మహిళా చెంఘిజ్ఖాన్’ అన్నారామె. నిజానికి చుగ్తాయ్ కలం కత్తి కంటే పదును.
రచయిత్రిగా చుగ్తాయ్ ఎంతటి ఉన్నత శిఖరాలను అధిరోహించిందో చెప్పడానికి ఒక్క
‘లిహాఫ్’ కథ చాలు. ఈ కథే ఆమెను బోను కూడా ఎక్కించింది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం
అశ్లీలత ఆరోపణతో లాహోర్ కోర్టులో కేసు నడిపింది.
- గోపరాజు నారాయణరావు