పేదలకు ప్రాణదాత | Doctor mane Medical Foundation and Research Centre | Sakshi
Sakshi News home page

పేదలకు ప్రాణదాత

Jul 17 2016 1:04 AM | Updated on Sep 4 2017 5:01 AM

పేదలకు ప్రాణదాత

పేదలకు ప్రాణదాత

‘‘మమ్మీ..! కాకాను చూస్తే ఏడుపొస్తోంది.. మనం ఏ హెల్ప్ చేయలేమా? అందరూ కాకాకు క్యాన్సర్ వచ్చిందని...

ఆదర్శం
‘‘మమ్మీ..! కాకాను చూస్తే ఏడుపొస్తోంది.. మనం ఏ హెల్ప్ చేయలేమా? అందరూ కాకాకు క్యాన్సర్ వచ్చిందని, ఇక ఆయన ఎక్కువ కాలం బతకలేడని అంటున్నారు. మరి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే కాకా బతుకుతాడు కదా మమ్మీ’’ అన్నాడు ఓ ఎనిమిదేళ్ల బాలుడు. ‘‘మన దగ్గర అంత డబ్బులు ఎక్కడున్నాయి కన్నా. మీ నాన్న సంపాదన అంతంత మాత్రమే కదా. అయినా డబ్బున్న వాళ్లకే ఆస్పత్రులన్నీ. మనలాంటి పేదవాళ్లకు రోగాలొస్తే చావాల్సిందే.

డాక్టర్లు డబ్బులు లేకుండా వైద్యం చేయరు’’ అన్నది ఆ తల్లి కొడుకు తలపై నిమురుతూ. అప్పుడు ఆ బాలుడి నోట ఓ మాట వచ్చింది... ‘‘నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతా మమ్మీ.. పేదలందరికీ ఫ్రీగా వైద్యం చేస్తా’’ అని.  2011 మే 1న స్వప్నిల్ మాణే అనే యువ డాక్టర్ ఆంకాలజీ సర్జన్‌గా సమాజానికి పరిచయమయ్యారు. ఈ స్వప్నిల్ మాణేనే ఆ ఎనిమిదేళ్ల బాలుడు. మెరిసేదంతా బంగారం కాదన్నట్లు... డాక్టర్లందరూ సంపన్నులు కాదు కదా.

అలాగే ఈ స్వప్నిల్ కూడా ధనవంతుడేమీ కాదు. దాంతో ముంబైలో తాను చదువుకున్న కాలేజీ  ‘టాటా మెమోరియల్ హాస్పిటల్’లోనే ఉద్యోగంలో చేరారు. జీవితం బాగానే సాగుతోంది.. కానీ మనసులో మాత్రం ఏదో వెలితి. అదే పేదలకు ఉచితంగా వైద్యం అందడం లేదని. రోజులు ఏదోలా గడుస్తున్నాయి కానీ మనసు మాత్రం ఆనందంగా లేదు.
 
ఓ రోజు హాస్పిటల్ లాబీలో కూర్చున్న పేషెంట్‌ను ‘ఏంటి మీ సమస్య. ఎందుకలా బాధగా ఉన్నారు?’ అని అడిగారు డాక్టర్ స్వప్నిల్. దానికి సమాధానంగా ఆ పేషెంట్ ‘‘నేనో క్యాన్సర్ పేషెంట్‌ని. వెంట తెచ్చుకున్న డబ్బులన్నీ ముంబైకి రావడానికే సరిపోయాయి. ఇప్పుడిక్కడ వైద్యం చేయించుకుంటే... హాస్పిటల్ బిల్ ఎలా కట్టాలి? తిరిగి ఊరికెలా వెళ్లాలా అని ఆలోచిస్తున్నా’’ అని చెప్పాడు. ఆ మాటతో స్వప్నిల్ మనసు చలించిపోయింది. అప్పుడు ఆ పేషెంట్ ట్రీట్‌మెంట్‌కు ఓ ఎన్‌జీఓ తరఫు నుంచి స్పాన్సర్‌షిప్ ఇప్పించి, వైద్యం చేయించారు.

అతను పూర్తిగా కోలుకున్నాక ఊరెళ్లడానికి డబ్బులు ఇచ్చి పంపారు. అదే రోజు స్వప్నిల్ ఒక నిర్ణయానికొచ్చారు. ఇకపై తన ప్రాక్టీసంతా మారుమూల పల్లెల్లోనే... అని నిశ్చయించుకొని ప్రశాంతంగా నిద్ర పోయారు. అనుకున్నదే తడవుగా పుణే సమీపంలోని రాహురీ గ్రామంలో హెల్త్‌క్యాంప్ మొదలుపెట్టారు. ఆ గ్రామస్తులంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారే. ఆ ఊళ్లో ఎవరికైనా క్యాన్సర్ వస్తే... హాస్పిటల్‌కు వెళ్లి చికిత్స చేయించుకునే స్థోమత లేదని గ్రహించారు స్వప్నిల్‌తో పాటు ఆయన భార్య డాక్టర్ సోనాలీ మాణే. దాంతో మిగతా డాక్టర్ల కంటే చాలా తక్కువ డబ్బు తీసుకొని వైద్యం చేయడం ప్రారంభించారు. అలా నెమ్మదిగా ఓ బిల్డింగ్‌ను అద్దెకు తీసుకొని, ‘డాక్టర్ మాణే మెడికల్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్’ను స్థాపించారు. ఎంతోమంది పేషెంట్స్ ఇక్కడ చాలా తక్కువ ఖర్చుతో తమ వ్యాధుల నుంచి బయటపడి హాయిగా జీవిస్తున్నారు.   
 
షిర్డీకి 40 కిమీల దూరంలో ఉన్న ఈ ముఫ్పై పడకల చారిటబుల్ హాస్పిటల్ ఇప్పటి వరకు మొత్తం 349 క్యాన్సర్ సర్జరీలను ఉచితంగా చేసింది. ఇంకా దాదాపు 60 మంది ఆపరేషన్‌కు రెడీగా ఉన్నారు. అలాగే స్వప్నిల్ టీమ్ మారుమూల గ్రామాల్లో 47 క్యాన్సర్ డిటెక్షన్ క్యాంపులు నిర్వహించింది. ఈ క్యాంపుల ద్వారా క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నవారిని గుర్తించి, వారిని క్యాన్సర్ నుంచి బయటపడేసింది. అంతేకాదు, క్యాన్సర్ పేషెంట్స్ శారీరకంగా కంటే మానసికంగా బాగా కుంగిపోతుంటారు. అందుకే ఈ హాస్పిటల్‌కు వచ్చిన పేషెంట్లకు ఫ్రీగా మెడిటేషన్ క్లాసులు చెప్పిస్తుంటారు.

అలా వారికి మానసిక ప్రశాంతత, ఆత్మస్థైర్యం పెంపొందించేలా చేస్తారు.
 ‘‘మా టీమ్‌లో మొత్తం 13మంది డాక్టర్లు, ఆరుగురు పారామెడికల్ స్టాఫ్ ఉన్నారు. అందరూ సేవా దృక్పథంతో పనిచేసేవారే. ఇప్పటి వరకు మేము మహారాష్ట్రలో 52 గ్రామాల్లో ఫ్రీ క్యాన్సర్ చెకప్, అలాగే మందుల పంపిణీ క్యాంపులు నిర్వహించాం. మనదేశంలో ఏడాదికి 50వేల మంది మహిళలు సెర్వికల్ క్యాన్సర్ (గర్భాశయ క్యాన్సర్)తో మరణిస్తున్నారు. అది చాలా దురదృష్టకరం. అందుకే మా టీమ్ మైస్‌గావ్, తహారాబాద్ అనే రెండు మారుమూల గ్రామాలను దత్తత తీసుకుంది.

అక్కడ 550 మంది పేషెంట్లకు ఫ్రీగా సెర్వికల్ క్యాన్సర్ ఆపరేషన్ చేశాం. అలాగే 106 క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. కేవలం రెండేళ్లలో అక్కడ సెర్వికల్ క్యాన్సర్ అన్న మాటే లేకుండా చేశాం. వ్యాధి ముదరక ముందే, దాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే... ప్రస్తుతం క్యాన్సర్ పెద్ద జబ్బే కాదు’’ అని ఆనందంగా చెప్పారు స్వప్నిల్. ఇలాంటి మానవతామూర్తులు ప్రతి చోటా ఉంటే... పేదరికంలో మగ్గుతున్న వ్యాధిగ్రస్తులు మరణశయ్య ఎక్కవలసిన అవసరం ఉండదు.
 
వారి ఆనందమే మాకు చాలు...
చారిటబుల్ హాస్పిటల్ గురించి స్వప్నిల్ చెప్పినప్పుడు సంతోషించాను. ఆయనెప్పుడూ పేద రోగుల గురించే ఆలోచించే వారు. కేవలం డబ్బు లేదనే కారణంగా ఎంతోమంది చనిపోతున్నారని బాధపడేవారు. ఆయన వల్లే నేనూ ఈ పుణ్యకార్యంలో చేయి కలిపాను. అద్దె బిల్డింగ్‌తో కష్టమవుతోందని, ‘సాయిధామ్’ పేరుతో సొంత చారిటబుల్ హాస్పిటల్‌ను ప్రారంభించాం. పేషెంట్లు కోలుకున్నాక, వారి కళ్లలో కనిపించే ఆనందాన్నే మా సంపదగా భావిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement