హోమ్‌ ప్యాక్స్‌ | beauty tips:Vegetable juice | Sakshi
Sakshi News home page

హోమ్‌ ప్యాక్స్‌

Jun 1 2018 12:36 AM | Updated on Jun 1 2018 12:36 AM

beauty tips:Vegetable juice - Sakshi

కాలమేదైనా చర్మకాంతికి ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించవచ్చు. పాలు, గుడ్డులోని తెల్లసొన, తేనె, కూరగాయల రసంతోనే మేనికి మెరుగు పెట్టవచ్చు.  

ముందు రోజు రాత్రి ఐదు బాదంపప్పులను నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే పై పొట్టు తీయాలి. వీటిని మెత్తగా రుబ్బి, పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి, మృదువుగా మసాజ్‌ చేయాలి. పదిహేను నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు చేస్తే పాలలోని గుణాలు మురికిని వదలగొట్టి, చర్మకాంతిని పెంచుతాయి. బాదం పప్పు లోని సహజమైన నూనెలు చర్మాన్ని మృదువుగా మార్చుతాయి. 

టీ స్పూన్‌ గుడ్డులోని తెల్ల సొనను ఒక గిన్నెలో వేసి, అందులో అర టీ స్పూన్‌ పాల మీగడ, అర టీ  స్పూన్‌ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, 15 నిమిషాలు ఉంచి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి పెరుగుతుంది. 

టేబుల్‌ స్పూన్‌ తేనెలో అరముక్క నిమ్మరసం పిండాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి, మెడకు, చేతులకు రాసి, 10 –15 నిమిషాలు ఉండాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మంపై మలినాలను తొలగించడంలో మైల్డ్‌ ఫేస్‌ క్లెన్సర్‌గా పనిచేస్తుంది. చర్మానికి తగినంత మాయిశ్చరైజర్‌ అందుతుంది. కాంతి పెరుగుతుంది. 

బంగాళదుంప, క్యారెట్‌ను ఉడికించి గుజ్జు చేయాలి. ఈ మిశ్రమంలో చిటికెడు బేకింగ్‌ సొడా, చిటికెడు పసుపు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు రాసుకొని రెండు నిమిషాలు ఉంచి, గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్‌ ముడతలను నివారించడంతో పాటు చర్మాన్ని మృదువుగా మార్చుతుంది. 

రెండు టీ స్పూన్ల రోజ్‌ వాటర్లో ఒక చుక్క గ్లిజరిన్, రెండు చుక్కల నిమ్మరసం వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని దూది ఉండతో అద్దుకుంటూ ముఖం, మెడకు రాసి, తుడవాలి. ఇది రోజంతా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది. చర్మం పొడిబారడం నివారిస్తుంది. చర్మం ముడతలు తగ్గి, యవ్వనకాంతితో మెరుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement