యంగ్&డ్యూటిఫుల్ | Young & Dutyfull | Sakshi
Sakshi News home page

యంగ్&డ్యూటిఫుల్

Mar 21 2014 4:57 AM | Updated on Aug 29 2018 8:56 PM

ఉరిమే ఉత్సాహానికి, ఉరకలెత్తే ఉత్తేజానికి చిహ్నం.. యువత! జనం గొంతుకకు, ప్రజాప్రాతినిధ్యానికి ప్రతీక.. రాజకీయం! ఇక యువత, రాజకీయం ఒక్కటైతే..? దేశమంతా యువ రాజకీయమే నడిస్తే..?

నవ భారత నిర్దేశకులు
 ఉరిమే ఉత్సాహానికి, ఉరకలెత్తే ఉత్తేజానికి చిహ్నం.. యువత! జనం గొంతుకకు, ప్రజాప్రాతినిధ్యానికి ప్రతీక.. రాజకీయం! ఇక యువత, రాజకీయం ఒక్కటైతే..? దేశమంతా యువ రాజకీయమే నడిస్తే..? భారత భవితను నిర్దేశించేదీ, ఉజ్వల భవిష్యత్తును సాకారం చేసి చూపేదీ యువ నాయకులే అవుతారు!!  సమాజంలో సమూల మార్పును కోరుతున్న మన దేశ యువత చట్టసభల్లో ఏటేటా తమ ప్రాతినిధ్యాన్ని పెంచుకుంటోంది. ఓటర్లమే కాదు.. లీడర్లమూ మేమేనని చాటుతోంది. 2009 ఎన్నికల్లో ఏకంగా 71 మంది యువ నేతలను లోక్‌సభకు పంపింది. వీరంతా నలభైల్లో ఉన్నవారే కావడం విశేషం. ప్రస్తుత లోక్‌సభలోని యువ తేజాలను ఓసారి చూద్దాం...

వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డి
ఇచ్చిన మాట కోసం పార్టీకి రాజీనామా చేయడమే కాదు ఎంపీ పదవిని తృణప్రాయంగా త్యజించిన యువనేత  వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో కడప స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. తన తండ్రి, ముఖ్యమంత్రి వైఎస్ మరణాన్ని తట్టుకోలేక మృతి చెందిన అభిమానుల కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు ఓదార్పు యాత్రను ప్రారంభించారు. కాంగ్రెస్ అధిష్టానం అందుకు అంగీకరించకపోవడంతో అభిమానులకు ఇచ్చిన మాట కోసం పార్టీని వీడారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. పార్టీని స్థాపించిన కొద్ది నెలలకే 2011లోజరిగిన కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో 5,45,672 ఓట్ల ఆధిక్యతతో నెగ్గారు.  దేశ చరిత్రలో ఇప్పటిదాకా ఐదు లక్షల ఓట్లకు పైగా ఆధిక్యత సాధించిన ముగ్గురు నేతల్లో జగన్ ఒకరు.  కడప జిల్లా పులివెందులలో 1972 డిసెంబర్ 21న జన్మించారు.
 
 ప్రియాంక గాంధీ
 ఇప్పటిదాకా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెట్టకపోయినా తల్లి సోనియాగాంధీ, సోదరుడు రాహుల్ రాయ్‌బరేలీ, అమేథీల్లో నిర్వహించే ప్రచార సభల్లో పాల్గొంటుంటారు. సోనియాకు, రాహుల్‌కు రాజకీయ సలహాలు ఇస్తారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జీసస్ అండ్ మేరీ కాలేజీ నుంచి సైకాలజీలో బీఏ పూర్తిచేశారు.
 
 ఎంపీ @ 19
 ప్రపంచంలోనే అతి పిన్న వయసు గల ఎంపీని ఎన్నుకున్న ఘనత ఆఫ్రికా దేశమైన ఉగాండాకే దక్కింది. ఉగాండాకు చెందిన ప్రోస్కోవియా ఓరోమయిట్ హైస్కూలు చదువు పూర్తవుతూనే నేరుగా పార్లమెంటుకు ఎన్నియ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో ఘన విజయం సాధించే నాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్ర మే. ఉగాండా అధ్యక్షుడు ముసెవెని వయసు 68 ఏళ్లు కాగా, ఉగాండా కేబినెట్ మంత్రుల సగటు వయసు 62 ఏళ్లు. అయితే, ఉగాండాలోని 78 శాతం జనాభా 30 ఏళ్ల లోపు యువతరమే కావడం గమనార్హం.
 
 -    ప్రపంచంలోని అతి పిన్న వయస్కులైన ఎంపీలలో ఆస్ట్రేలియా ఎంపీ వ్యాట్ రాయ్ రెండో స్థానంలో ఉన్నారు. లిబరల్ నేషనల్ పార్టీకి చెందిన వ్యాట్ రాయ్ ఎంపీగా 2010 ఎన్నికల్లో గెలుపొందే నాటికి ఆయన వయసు 20 ఏళ్లు మాత్రమే.
 -    కెనడా ప్రతినిధుల సభకు ఎన్నికైన లారిన్ లియు అతి పిన్న వయస్కులైన ఎంపీల్లో
     మూడో స్థానంలో నిలుస్తున్నారు. మూడేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో గెలుపొందే నాటికి ఆమె వయసు 21 ఏళ్లే. కెనడాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీగా ఇప్పటికీ ఆమెదే రికార్డు.
 
 రాహుల్ గాంధీ
 43 ఏళ్ల బ్రహ్మచారి. కాంగ్రెస్ తరఫున అప్రకటిత ప్రధాని అభ్యర్థిగా ప్రచారంలో ఉన్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ నియోజకవర్గం నుంచి వరుసగా రెండుసార్లు నెగ్గారు. 1970 జూన్ 19న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ స్కూల్, డెహ్రాడూన్‌లోని ద డూన్ స్కూల్‌లో ప్రాథ మిక విద్య అభ్యసించారు. అనంతరం 1989లో ఢి ల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ తర్వాత అమెరికా లోని హార్వర్‌‌డ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. కొన్నాళ్ల పాటు లండన్‌లోని మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ అయిన మానిటర్ గ్రూప్‌లో పని చేశారు. తర్వాత ముంబైలోని ఓ ప్రైవేటు కంపెనీ డెరైక్టర్లలో ఒకరిగా కొనసాగారు. ప్రస్తుతం పార్టీ ఉపాధ్య పగ్గాలతో పాటు భారత యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలకు అధినేతగా వ్యవహరిస్తున్నారు.
 
 సచిన్ పైలట్
 యూపీఏ సర్కారులో కార్పొరేట్ వ్యవహారాల సహాయ మంత్రిగా కొనసాగుతున్న సచిన్ పైలట్ (36), రాజస్థాన్‌లోని అజ్మీర్ నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దివంగత కాంగ్రెస్ నేత రాజేశ్ పైలట్ వారసునిగా 2004 లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగారు. తొలిసారి పోటీలోనే బీజేపీ ప్రత్యర్థి కిరణ్ మహేశ్వరిపై దాదాపు 76 వేల ఓట్ల ఆధిక్యతతో గెలిచారు. ఢిల్లీ వర్సిటీ పరిధిలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశాక, అమెరికాలోని పెన్సిల్వేనియా వర్సిటీ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కుమార్తె సారా అబ్దుల్లాను పెళ్లాడారు.
 
 కె. రాజగోపాల్‌రెడ్డి
 2009లో భువనగిరి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి నెగ్గారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్వగ్రామం  నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల. తన తల్లి పేరు మీదుగా సుశీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టు స్థాపించి పారిశ్రామికవేత్తగా బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయ అరంగేట్రం చేశారు. సోనియూగాంధీ, వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రోత్సాహంతో రాజకీయూల్లోకి వస్తున్నట్టు 2008 సెప్టెంబర్‌లో ప్రకటించారు. 2009 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి నోముల నర్సింహయ్యపై 1.39 లక్షలకు పైగా ఆధిక్యతతో గెలుపొందారు.
 
 జ్యోతిరాదిత్య సింధియా
 గ్వాలియర్ రాజకుటుంబ వారసుడు, దివంగత కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా కుమారుడైన జ్యోతిరాదిత్య సింధియా (43) మధ్యప్రదేశ్‌లోని గుణ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీఏ సర్కారులో ప్రస్తుతం విద్యుత్ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. 2002లో గుణ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 2004, 2009 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఇక్కడి నుంచే గెలుపొందారు. హార్వర్డ్ వర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో బీఏ, స్టాన్‌ఫర్‌‌డ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

ప్రియా దత్
 ఈమె బాలీవుడ్ హీరో సునీల్ దత్, నటి నర్గీస్ దంపతుల కుమార్తె. ప్రముఖ హీరో సంజయ్ దత్‌కు చెల్లెలు. వయసు 47. ప్రస్తుతం ముంబై నార్త్ సెంట్రల్ నియోజకవర్గ ఎంపీగా ఉన్నారు. ముంబై యూనివర్సిటీకి చెందిన సోఫియా కాలేజీ నుంచి సోషియాలజీలో బీఏ పట్టా పొందారు.
 
 శ్రుతి చౌధరీ
 ఈమె హర్యానా మాజీ సీఎం దివంగత బన్సీలాల్ మనవరాలు. వయసు 38 ఏళ్లు. ప్రస్తుతం హర్యానాలోని భివానీ-మహేంద్రగఢ్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. 2013 ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై 55 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో నెగ్గారు.
 
 జ్యోతి మీర్ధా
 ఈమె ఎంబీబీఎస్ చదివారు. వృత్తిరీత్యా వైద్యురాలు. కేంద్ర మాజీ మంత్రి నాథూరాం మీర్ధా మనవరాలు. వయసు 41. 2009 ఎన్నికల్లో రాజస్థాన్‌లోని నాగౌర్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలిచారు.
 
 మౌసమ్ నూర్
 పశ్చిమబెంగాల్‌లోని మాల్దా ఉత్తర్ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్నారు. వయసు 34. కేంద్ర మాజీ మంత్రి ఏబీఏ ఘనీఖాన్ చౌధరి మేనకోడలు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షురాలు.
 
 రమ్య
 ప్రస్తుత లోక్‌సభలో అత్యంత పిన్న వయస్కురాలైన మహిళా ఎంపీ. వయసు 30 ఏళ్లు. 2013 ఆగస్టులో కర్ణాటకలోని మాండ్య లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా గెలవకముందు ఆమె సినీ నటి. ఈమె అసలు పేరు దివ్య.
 
 డింపుల్ యాదవ్
 ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ భార్య. వయసు 36. తల్లిదండ్రులది ఉత్తరాఖండ్. తండ్రి ఎస్‌సీ రావత్ ఆర్మీ రిటైర్డ్ కల్నల్. లక్నో యూనివర్సిటీ నుంచి హ్యుమానిటీస్‌లో గ్రాడ్యుయేషన్ చేశారు డింపుల్. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో మెరైన్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని వచ్చిన అఖిలేశ్‌తో ప్రేమలో పడ్డారు. వివాహమైన తర్వాత 2009 ఉప ఎన్నికలో ఫిరోజాబాద్ ఎంపీ స్థానానికి  పోటీ చేసి సినీ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు కనౌజ్ లోక్‌సభ స్థానాన్ని వదులుకోవడంతో ఆ స్థానం నుంచి డింపుల్ ఎంపీగా ఏకగ్రీవంగా  నెగ్గారు.
 
 సుప్రియా సూలే
 నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కుమార్తె. వయసు 44. మహారాష్ట్రలోని బారమతి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. ముంబైలోని జైహింద్ కాలేజీ నుంచి మైక్రో బయాలజీలో బీఎస్పీ పట్టా పొందారు. 1992లో సదానంద బాలచంద్రను వివాహమాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయ్యాక కొన్నాళ్లు కాలిఫోర్నియాలో నివాసం ఉన్నారు. తర్వాత ఇండోనేషియా, సింగపూర్‌లో మరికొంత కాలం గడిపి భారత్‌కు తిరిగొచ్చారు.
 
 అగాథా సంగ్మా
 ఈమె లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా కూతురు. వయసు 33. ప్రస్తుతం మేఘాలయలోని తురా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా చేశారు. అప్పట్లో మన్మోహన్ కేబినెట్‌లో అతి పిన్న వయస్కురాలు. పుణె యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు.
 
 బాప్ రే.. పాప్!
 రష్యన్ పాప్ గాయని యూలియా వోల్కోవా(18), ఆమె సహ గాయకురాలు లెనా కటీనా(19) 2004 రష్యా అధ్యక్ష ఎన్నికల్లో వ్లాదిమిర్ పుతిన్‌పై పోటీ చేస్తున్నట్టు ప్రకటించగానే వారి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ దేశంలో కుర్రకారు సంతకాల సేకరణ మొదలుపెట్టింది! ఈ పరిణామానికి ఎన్నికల అధికారులు నిర్ఘాంతపోయారు. ‘‘అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి కనీస వయోపరిమితి 35 ఏళ్లని మీకు తెలీదా’ అని ఆ ఇద్దరమ్మాయిలను అడిగారు. వాళ్లిచ్చిన సమాధానం ఏంటో తెలుసా..? ‘‘అదంతా మాకు తెలీదు. మేం ఇద్దరం కాదు. ఒక్కరం. మా ఇద్దరి వయసూ కలిపితే మీరడిగిన 35 ఏళ్లకన్నా రెండేళ్లు ఎక్కువే వస్తుంది. ఇక మీకు అభ్యంతరం ఏమిటి?’’ అని!!

నవీన్ జిందాల్
పార్లమెంటులోని అపర కుబేరుల్లో ఒకరిగా పేరుపొందిన నవీన్ జిందాల్ (44), హర్యానాలోని కురుక్షేత్ర నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిందాల్ పరిశ్రమల వ్యవస్థాపకుడు ఓపీ జిందాల్ తనయుడైన నవీన్ జిందాల్, టెక్సాస్ వర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. టెక్సాస్ వర్సిటీలో చదువుకుంటున్నప్పుడు విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా కొనసాగారు.
 
 మిలింద్ దేవ్‌రా
 కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి మురళీ దేవ్‌రా తనయుడైన మిలింద్ దేవ్‌రా (37) దక్షిణ ముంబై నియోజకవర్గం నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీఏ సర్కారులో ప్రస్తుతం కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నారు. తొలిసారిగా 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి దక్షిణ ముంబై నుంచి నెగ్గారు. తిరిగి 2009లో ఏకంగా 1.12 లక్షల ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.
 
 వరుణ్ గాంధీ
 ఫిరోజ్ వరుణ్‌గాంధీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మనవడు. సంజయ్‌గాంధీ, మేనకాగాంధీల కుమారుడు. 1980 మార్చిలో జన్మించారు. మూడు నెలల వయసులోనే విమాన ప్రమాదంలో తండ్రిని కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో జిడ్డు కృష్ణమూర్తి స్థాపించిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డిగ్రీ చేశారు. 2009 ఎన్నికల్లో యూపీలోని ఫిలిబిత్ నుంచి బీజేపీ తరఫున నెగ్గారు.
 
 దుష్యంత్ సింగ్
 రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే తనయుడు, గ్వాలియర్ రాజ కుటుంబానికి చెందిన మరో వారసుడు దుష్యంత్ సింగ్ (40). రాజస్థాన్‌లోని ఝాలావర్-బరన్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని ఐహెచ్‌టీటీఐ నుంచి మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేశారు. 2004 ఎన్నికల్లో గెలుపొంది తొలిసారిగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఆతిథ్య రంగంపై ఈయనకు అమితమైన ఆసక్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement