నకిలీ ఉద్యోగాల వల.. తప్పించుకునేదెలా!

Awareness On Fake Job Apponitments - Sakshi

విదేశాల్లో, ఎంఎన్‌సీల్లో, ప్రముఖ కంపెనీల్లో కొలువులంటూ ఎరరైల్వేలో, రక్షణ రంగంలో, పీఎస్‌యూల్లో ఉద్యోగాలపేరిట  భారీగా మోసంనకిలీ జాబ్‌ సైట్స్, నకిలీ ఈ–మెయిల్స్, ఫేక్‌ కన్సల్టెన్సీలతో నిరుద్యోగులను వంచిస్తున్న వైనంఫేక్‌ ఆఫర్‌ లెటర్లతో లక్షలు కొల్లగొడుతున్న సైబర్‌ నేరగాళ్లుఅప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు

‘నాగేశ్వరరావు ఓ ప్రభుత్వరంగ సంస్థలో శాస్త్రవేత్తగా స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. విశ్రాంత సమయంలోఖాళీగా ఉండలేక తన అనుభవానికి తగ్గ పార్ట్‌టైమ్‌ ఉద్యోగం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఓ జాబ్‌పోర్టల్‌లో రెజ్యూమె అప్‌లోడ్‌ చేశారు. కొన్నిరోజుల తర్వాత లండన్‌లో ఓ నిర్మాణ కంపెనీలో జాబ్, భారీవేతనంతో ఉద్యోగమంటూ ఆఫర్‌ వచ్చింది. అందుకోసం రిజిస్ట్రేషన్‌ ఫీజు, వీసా ప్రాసెసింగ్‌ ఫీజులు, పోలీస్‌
క్లియరెన్స్‌ ఫీజు, యాంటీ టెర్రరిజం ఫీజు.. మొదలైన పేర్లతో పలు దశల్లో నాగేశ్వరరావు నుంచి డబ్బుగుంజడం మొదలుపెట్టారు. మొత్తంమీద రూ.19 లక్షలు వదిలించుకున్న తర్వాత అసలు మోసంబయటపడింది. మోసపోయానని తెలుసుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించారు నాగేశ్వరరావు.’

‘సంధ్యారాణి ఎంబీఏ ఫైనాన్స్‌ పూర్తిచేసింది. ఆమెకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌తో వివాహమైంది. ఐదేళ్ల బాబుఉన్నాడు. భర్త అకాలమరణంతో కుటుంబ పోషణ కోసం సంధ్యారాణి తన చదువుకు తగ్గ ఉద్యోగం కోసం
ప్రయత్నాలు ప్రారంభించింది. ఓ జాబ్‌ పోర్టల్‌లో రెజ్యూమె అప్‌లోడ్‌ చేసింది. ప్రముఖ బ్యాంకులో జాబ్‌ఆఫర్‌ అంటూ ఓ అగంతకుడు ఫోన్‌ చేశాడు. టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్‌ ఇంటర్వ్యూ తీసుకున్నారు.
తర్వాత రిజిస్ట్రేషన్‌ పేరుతో రూ.3,500 చెల్లించాలని చెప్పడంతో ఆమె ఆ మొత్తాన్ని అకౌంట్‌లోజమచేసింది. బ్యాంకు లెటర్‌ప్యాడ్‌తో ఆఫర్‌ లెటర్‌ పంపించారు. ఉద్యోగం సొంతం కావాలంటే.. మరికొంత
చెల్లించాలన్నారు. వివిధ దశల్లో రూ.5 లక్షలు వసూలు చేశారు. తీరా జాయినింగ్‌ లెటర్‌ తీసుకొని వెళ్లేసరికి..ఆ  ఆఫర్‌ లెటర్‌కు, సంస్థకు ఎలాంటి సంబంధం లేదని సంస్థ ప్రతినిధులు తేల్చిచెప్పారు. దాంతో
మోసపోయానని తెలుసుకున్న సంధ్యారాణి సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది.

హైదరాబాద్‌ :ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇలా ఎంతోమంది నిరుద్యోగులు ఫేక్‌ ఉద్యోగ ఆఫర్లతో భారీగా మోసపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో ఉద్యోగాలకు పోటీ నానాటికీ తీవ్ర మవుతోంది. ఉద్యోగాలు లభించడం కష్టమవుతున్న పరిస్థితుల్లో టాప్‌ కంపెనీ నుంచి ఆఫర్‌ లెటర్‌ అనేసరికిæ నిరుద్యోగులు రూ.లక్షలు అప్పుచేసి మరీ చెల్లిస్తు న్నారు. ఆ తర్వాత ఆర్థికంగా చితికి పోతున్నారు. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలను లక్ష్యంగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు లక్షలు కొల్లగొడుతున్నారు. సంస్థలు విడుదల చేసే ఆఫర్‌ లెటర్‌ మాదిరిగానే ఉండే లెటర్‌ హెడ్‌తో ఉద్యోగార్థులను బురిడీ కొట్టిస్తున్నారు.

జాబ్‌ పోర్టల్స్‌ నుంచే
నేటి ఆన్‌లైన్, ఇంటర్‌నెట్‌ యుగంలో ఎక్కడి నుంచైనా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగాలను ఒడిసిపట్టుకునే అవకాశముంది. ముఖ్యంగా ఇంటర్నెట్‌ సహాయంతో దేశ విదేశాల్లో కొలువులు వెతుక్కునే వీలుంది. అందుకోసం జాబ్‌ పోర్టల్స్‌లో నిరుద్యోగులు రెజ్యూమెలు అప్‌ లోడ్‌ చేస్తుంటారు. ఇదే ఇప్పుడు సైబర్‌ నేరగాళ్లకు  వరంలా మారింది. నిరుద్యోగులు జాబ్‌ పోర్టల్స్‌ లో అప్‌లోడ్‌ చేసిన రెజ్యూమెల నుంచి సైబర్‌ నేరగాళ్లు అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నారు. అమాయకులకు ఉద్యోగాల ఎరవేసి భారీగా డబ్బులు గుంజి కనిపించకుండా పోతున్నారు.

ఫేక్‌.. గుర్తించండిలా!
కొందరు ముఠాగా ఏర్పడి ఒకరు హెచ్‌ఆర్‌గా, మరొకరు టెక్నికల్‌ పర్సన్‌గా పరిచయం చేసుకొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్‌ వంటి కంపెనీల పేర్లు చెప్పి... హడావుడి చేస్తుంటారు. కొందరు ఏకంగా రైల్వేలో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించి శిక్షణ సైతం ఇస్తూ పోలీసులకు చిక్కడం తెలిసిందే. ఇలాంటి వాళ్లు నిరుద్యోగులకు తరచూ ఫోన్‌లు చేస్తూ సంభాషణలు కొనసాగిస్తారు. ఆ క్రమంలో ఏదో ఒక సందర్భంలో రిజిస్ట్రేషన్‌ పేరిటగానీ లేక మరేదైనా కారణం చెప్పి తమ వ్యక్తిగత ఖాతాలో డబ్బులు జమ చేయమని కోరుతారు. వీరు కచ్చితంగా ఫేక్‌ అని నిర్ధారించుకోవచ్చు.
ఎంపిక ప్రక్రియ ఏ దశలోనైనా ఉద్యోగం ఇచ్చేందుకు డబ్బులు అడుగు తున్నారంటే అది కచ్చితంగా మోసం అని భావించాలి. కంపెనీ పెద్దదైనా, చిన్నదైనా.. అభ్యర్థుల నుంచి డబ్బులు అడగవనే విషయాన్ని గుర్తించుకోవాలి.
ఇంకొందరు మోసగాళ్లు మరో అడుగు ముందుకేసి.. ఆఫర్ల లెటర్లు సైతం జారీ చేస్తారు. ఫలానా తేదీలో కంపెనీలో చేరాలని నమ్మబలుకుతారు. ఈలోపు కొంత మొత్తాన్ని తమ ఖాతాలో వేయమంటారు.

వీరు కూడా నకిలీలే!
బ్యాంక్‌ అకౌంట్స్, టాక్స్‌ ఫామ్స్, పాన్‌ నెంబర్, ఆధార్‌ కార్డ్‌.. ఇలాంటివి అడుగుతున్నారంటేనే అనుమానించాలి.
ఆఫర్‌ లెటర్‌ లేదా ఉద్యోగం నిజమైనదే అని  న మ్మించేందుకు ఫోటోలు, ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫి కెట్లు, మెడికల్‌ సర్టిఫికెట్, విద్యార్హతల సర్టిఫికెట్లు సమర్పించమని అడుగుతారు.
నేరగాళ్లు జారీచేసే ఆఫర్‌ లెటర్లను జాగ్రత్తగా గమనిస్తే ఎన్నో తప్పులు కనిపిస్తాయి. ఒక ప్రొఫెషనల్‌ సంస్థ జారీచేసే అపాయింట్‌మెంట్‌ లెటర్‌కు, నకిలీలు ఇచ్చే లెటర్లకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. ఫేక్‌

ఆఫర్‌ లెటర్లలో.. ఉద్యోగంలో భాగంగా నిర్వర్తించాల్సిన పాత్ర, విధుల గురించి స్పష్టత ఉండదు. గ్రామర్‌ తప్పులు, స్పెల్లింగ్‌ పొరపాట్లు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. ఆఫర్‌ లెటర్లలో సంస్థల లోగోలు, హోలోగ్రాంలను క్షుణ్నంగా పరిశీలిస్తే అవి నకిలీ అని తేలుతుంది.
ఇటీవల కాలంలో సైబర్‌ నేరగాళ్లు ఈ–మెయిల్స్‌ లోనే ఆఫర్‌లెటర్స్‌ ఇస్తున్నారు. విదేశాల్లో జాబ్స్, భారీగా జీతాలు అంటూ ఆకర్షిస్తున్నారు. డిపాజిట్‌ రూపంలో కొంత మొత్తం, వీసా ప్రాసెసింగ్‌కు మరికొంత చెల్లించమని కోరుతున్నారు. ఈ–మెయిల్స్‌ డొమైన్‌ పేరు కూడా సంస్థ పేరుతోనే ఉంటున్నాయి.
మనం చదివిన కోర్సుకు సంబంధం లేని ఉద్యో గాలు కూడా ఈ–మెయిల్స్‌ ద్వారా వస్తుంటాయి.  ఇలాంటివి పట్టించుకోకపోవడం మేలు.
సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో వినిపించే పదం ‘బ్యాక్‌డోర్‌’. టాప్‌ ఐటీ కంపెనీలో నేరుగా జాబ్‌ ఇప్పిస్తామని నమ్మబలికి రూ.లక్షల్లో వసూలు చేస్తాయి కొన్ని నకిలీ కన్సల్టెన్సీలు. సాఫ్ట్‌వేర్‌ సంస్థలుగానీ, ఇతర ఏ కంపెనీలు అయినా ప్రతిభ ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తాయి అనే విషయాన్ని గమనించాలి.
మరికొందరు సాఫ్ట్‌వేర్‌ ట్రైనింగ్‌ సంస్థ అని చెప్పి.. శిక్షణ పూర్తయ్యాక   ఉద్యోగావకాశం కల్పిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు గుంజి ఆ తర్వాత బోర్డు తిప్పేస్తారు. ఇలాంటి కేసులు ఇప్పుడు అనేకం.
ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలంటూ.. ఫేక్‌ జాబ్‌ నోటిఫికేషన్స్‌ ఇటీవల కాలంలో
సర్వసాధారణ మయ్యాయి. ఉదాహ రణకు కొద్ది రోజుల క్రితం తెలంగాణ అగ్రి డవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌లో కొలు వులు అంటూ.. నోటి ఫికేషన్‌ ఇచ్చి అభ్యర్థుల నుంచి దరఖాస్తు ఫీజు వ సూలు చేశారు. ఇలా దరఖాస్తు ఫీజు రూపే ణ కూడా వందల మంది నష్టపోతున్నారు.

అప్రమత్తత అవసరం
కంపెనీలు నియామకాల్లో పారదర్శ కత పాటిస్తున్నాయి. తమ అధికారిక వెబ్‌సైట్లలో ఖాళీల వివరాలను, తమ అవసరాలను పొం దుపరుస్తున్నాయి. అలానే, లింక్డ్‌ ఇన్‌ వంటి ప్రొఫెషనల్‌ వెబ్‌సైట్‌ల్లో సంస్థలు ఉద్యోగ అవ కాశాలను పోస్ట్‌ చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నమ్మదగ్గ మార్గాల్లో ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తే మోసపోవడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది.
మీకున్న నెట్‌వర్క్‌ను ఉపయోగించుకొని రిఫరల్‌ ద్వారా ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవచ్చు. కంపెనీ కాకుండా థర్డ్‌ పార్టీ నుంచి ఉద్యోగ అవకాశం వస్తే నెట్‌వర్క్‌ ద్వారా నిజానిజా లను తెలుసుకోవాలి.
టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ సమయం లో వ్యక్తిగత సమాచారం అవసరమై నంత వరకే చెప్పాలి. కంపెనీలు వ్యక్తిగత వివరాలు కొంతమేరకు అడిగినా..∙మరీ లోతుగా అడిగే అవకాశం ఉండదు. తార్కికంగా ఆలోచించి సమాధానాలు ఇవ్వడం మేలు.
అపరిచిత వ్యక్తుల నుంచి, కన్సల్టెన్సీల నుంచే వచ్చే ఉద్యోగ ఆఫర్లను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. ఆయా సంస్థల అధికారిక ఈ– మెయిల్స్‌కు, ల్యాండ్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌ చేసైనా వివరాలు తెలుసుకోవాలి.

నేరుగా వెళ్లి కనుక్కోండి
ఉద్యోగాల కోసం నిరుద్యోగులు పడే తాప త్రయాన్ని సైబర్‌ నేరగాళ్లు సొమ్ము చేసుకుం టున్నారు. ఇప్పుడు ఉద్యోగాల పేరిట అన్ని వయసుల వారు మోసపోతున్నారు. ప్రముఖ బహుళజాతి కంపెనీల్లో ఉద్యోగాలంటూ.. ఎర వేస్తూ రూ.లక్షలు లాగుతున్నారు. కాగ్నిజెంట్, ఐబీఎం, ఇన్ఫోసిస్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని టోకరా వేస్తున్నారు. కాబట్టి ఉద్యోగార్థులు అప్రమత్తంగా ఉండాలి. మన హైదరాబాద్‌లో ఆయా ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నాయి. నేరుగా అక్కడికి వెళ్లి ఉద్యోగ వకాశాల గురించి వాకబు చేయాలి. సంస్థలు జీతాలు ఇచ్చి నియమించుకుం టాయి. అంతేకానీ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇయ్యవు అనే విషయాన్ని గుర్తించాలి. ఆఫర్‌ లెటర్‌లో కంపెనీల లోగోలు, లెటర్‌ హెడ్స్‌ తదితర వివరాలను ధ్రువీకరించుకోవాలి. అపరిచితులకు డబ్బులు బదిలీచేసే ముందు తార్కికంగా ఆలోచించాలి.
– ఎస్‌.హరినాథ్, ఏసీపీ, సైబర్‌క్రైమ్స్, రాచకొండ.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top