– బస్ పాస్ ఐడీ, రెన్యూవల్ చార్జీలు పెంచిన ప్రభుత్వం
– ఏటా రూ. అర కోటికిపైగా విద్యార్థులపై అదనపు భారం
– 50 వేల మంది విద్యార్థులపై ప్రభావం
– సోమవారం నుంచే అమల్లోకి రాక
కర్నూలు(రాజ్విహార్): పేద విద్యార్థులకు రాయితీలు ఇవ్వాల్సిన ప్రభుత్వం వారిపై భారాలు మోపుతోంది. ఇప్పుడు తాజాగా ఆర్టీసీ బస్ పాసుల ఐడెంటిటీ (ఫొటో గుర్తింపు)కార్డుల ధర, రెన్యూవల్స్ చార్జీని పెంచింది. ఇప్పటికే ఆన్లైన్లో బస్సు పాసుల మంజూరు విధానం అమల్లోకి తీసుకొచ్చి సర్వీసు చార్జీలను వసూలు చేస్తున్న సంస్థ తాజాగా వాటి ధర పెంచేసింది. దీంతో జిల్లాలోని మొత్తం 50 వేల మంది విద్యార్థులపై రూ. అర కోటికిపైగా అదనపు భారం పడింది. ఐడెంటిటీ కార్డుపై రూ.10 పెంచగా ప్రతి నెలా తీసుకునే రెన్యూవల్స్ పాస్ టికెట్పై రూ.5 పెంచేసింది. కొత్త చార్జీల ధరలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చేశాయి.
– 50 వేల మంది విదా్యర్థులపై భారం:
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన విద్య వసతులు లేకపోవడంతో విద్యార్థులు సమీపంలోని పట్టణాలకు వెళ్లి విద్యా సంస్థలో చేరుతారు. హాస్టల్ సీటు రాని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే రాయితీ పాసులు పొంది ఆర్టీసీ బస్సుల్లో రాకపోకలు సాగిస్తున్నారు. విద్యా సంస్థలు తెరిచినప్పటి నుంచి పరీక్షలు ముగిసే వరకు పాసులను వినియోగించుకుంటారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 50వేల మందికిపైగా విద్యార్థులు బస్ పాసుల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. వీరందరిపై పెరిగిన భారం పడనుంది.
– మోత అరకోటిపైనే..
జిల్లాలో దాదాపు 50 వేల మందికి పైగా విద్యార్థులు ఆర్టీసీ బస్పాసులు పొంది రాకపోకలు సాగిస్తున్నారు. పాస్ తీసుకునే మొదట్లో మంజూరు చేసే ఐడెంటిటీ కార్డు ధర రూ.30 ఉండగా రూ.10 పెంచి రూ.40 వసూలు చేస్తున్నారు. దీంతో 5లక్షల భారం పడనుంది. ప్రతి నెలా చెల్లించే రెన్యూవల్స్పై సర్వీసు చార్జీ రూ.15 ఉండగా రూ.5పెంచి రూ.20 వసూలు చేయనున్నారు. 50 వేల మంది 12 నెలల పాటు రెన్యూవల్స్ చేసుకుంటే రూ.30లక్షల వరకు అదనపు భారం పడనుంది. దీంతోపాటు దరఖాస్తు, వివరాల ఆన్లైన్ అప్లోడ్ కోసం రూ.15లక్షల వరకు భారం పడుతుంది.
– ప్రతి ఏటా వాతలే:
బస్పాసుల మంజూరు ప్రక్రియను ఆన్లైన్ చేస్తూ 2015 జూన్ 20వ తేదీన ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీ పరం చేసింది. అప్పట్లో మొదట పేర్లు, ఇతర వివరాల రిజిస్ట్రేషన్ కోసం ఒక్కొక్కరి నుంచి రూ.25 వసూలు చేసింది. దీంతో రూ.6.60లక్షల వరకు భారం పడగా ప్రతి నెలా రెన్యూవల్ కోసం రూ.10 వసూలు చేస్తూ మరో రూ.52.80లక్షల భారం వేసింది. మొత్తం ఏడాదికి రూ.59.40లక్షలు విద్యార్థులపై వేశారు. 2016లో రెన్యూవల్స్ చార్జీని రూ.10 నుంచి రూ.15కి పెంచారు. దీంతో రూ.30లక్షల భారం వేశారు. ఇప్పుడు తాజాగా ఐడెంటిటీ కార్డుల ధర, రెన్యూవల్స్ చార్జీని పెంచి రూ.50లక్షల వరకు భారం వేసింది.
– ధరలు తగ్గించకపోతే ఆందోళలు: టి. అనిల్ కుమార్, వైఎస్ఆర్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు.
ప్రభుత్వం పేద విద్యార్థుల బస్ పాసులపై పెంచిన ఐడెంటిటీ కార్డులు, రెన్యూవల్స్ ధరను వెంటనే తగ్గించాలి. లేని పక్షంలో విద్యార్థులతో కలసి ఆందోళనలు నిర్వహిస్తాం.
– ఉచిత పాసుల హామీ నెరవేర్చాలి: లక్ష్మీ నరసింహ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్శి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇంటర్మీడియేట్ వరకు ఉచితంగా బస్ పాసులు ఇస్తామని హామీ ఇచ్చారు. దాన్ని నెరవేర్చకుండా ప్రతి ఏటా పాసుల చార్జీలు పెంచి విద్యార్థులపై భారం వేస్తే సహించబోం.
– ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు: శ్రీనివాసులు, డీసీటీఎం, ఆర్టీసీ, కర్నూలు.
విద్యార్థి బస్ పాసుల ఐడెంటిటీ కార్డు, రెన్యూవల్స్ సర్వీసు చార్జీని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెంచి అమలు చేస్తున్నాం. ఐడీ కార్డులపై రూ.10, ప్రతి నెలా రెన్యూవల్స్పై రూ.5 విద్యార్థులు అదనంగా చెల్లించాలి.