టీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయ వేడి రగిలించడంలో బుధవారం ఖమ్మంలో జరిగిన పార్టీ 15వ ప్లీనరీ విజయవంతమైంది.
పాలేరు ఉప ఎన్నిక ముందు వ్యూహాత్మకంగా సభ
♦15వ ప్లీనరీ వేదికగా శ్రేణులకు సీఎం దిశానిర్దేశం
♦ నామినేటెడ్ పదవులపై భరోసా
ఖమ్మం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: టీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయ వేడి రగిలించడంలో బుధవారం ఖమ్మంలో జరిగిన పార్టీ 15వ ప్లీనరీ విజయవంతమైంది. పూర్తిగా వారిని కార్యోన్ముఖులను చేసేలా సాగింది. సీఎం కేసీఆర్ మరోసారి పార్టీ వర్గాలకు దిశానిర్దేశం చేశారు. రెండేళ్లుగా పూర్తిగా అసంతృప్తిలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వంలో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్లీనరీ వేదిక ను ఉపయోగించుకున్నారు. ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తున్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైందని, మే నెలాఖరులోగా అన్ని పదవులూ భర్తీ అవుతాయని హామీ ఇచ్చారు.
నిజానికి ఈ ప్లీనరీ నేపథ్యంలోనే ప్రభుత్వం మంగళవారం హడావుడిగా ఆర్టీసీ, మిషన్ భగీరథ, తెలంగాణ అధికార భాషా సంఘం చైర్మన్ పదవులను భర్తీ చేసింది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపైనే ఉందంటూ కేసీఆర్ మార్గనిర్దేశం చేశారు. ఇక నుంచి ప్రభుత్వం, పార్టీ జోడు గుర్రాలుగా పరుగులెత్తాలని అభిలషించారు. పార్టీ కమిటీలనూ పునర్వ్యవస్థీకరిస్తామని చెప్పడం ద్వారా పార్టీ పదవులపై కూడా ఆశలు రేపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 22 నెలలో చాలామంది నాయకులు అవకాశాలు రాక నిస్తేజంలోకి జారిపోయారు. తమ వంతు వచ్చే దాకా ఎదురు చూడాలని వారికి సూచించిన అధినేత, పార్టీకి విధేయతతో పనిచేసిన వారికి పదవులు వెదుక్కుంటూ వస్తాయని చెప్పుకొచ్చారు.
‘ప్రచార సభ’గా బహిరంగ సభ
పాలేరు ఉప ఎన్నికల షెడ్యూలు, నోటిఫికేషన్తో సంబంధం లేకుండా ఖమ్మంలో పార్టీ 15వ ప్లీనరీని నిర్వహించాలని ప్రకటించినా, ఉప ఎన్నికల నేపథ్యంలో ముందు చూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగినట్టే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో షరతుల నడుమ జరిగిన ప్లీనరీ, బహిరంగ సభ దాదాపు ఉప ఎన్నికల ప్రచార సభగానే సాగాయి. ఖమ్మం జిల్లాలో విస్తరించాలని బలంగా కోరుకుటున్న టీఆర్ఎస్ నాయకత్వం... ప్లీనరీని, బహిరంగ సభను ఆ దిశగా బాగానే ఉపయోగించుకుంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలేరులో గెలిపిస్తే ఎన్నడూ చూడని, ఊహించని అభివృద్ధి చూపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరాలు కురిపించలేదు గానీ, పాలేరు ప్రజల్లో మాత్రం ఆశలు రేపారు. మొత్తంగా పదిహేనో ప్లీనరీ ద్వారా టీఆర్ఎస్ కార్యకర్తలో నాయకత్వం ఉత్సాహం నింపింది. పనిలో పనిగా పాలేరు ఉప ఎన్నికల ప్రచారానికీ శ్రీకారం చుట్టింది. ఖమ్మంలో విస్తరించడానికి రంగం సిద్ధం చేసుకుంది. నాయకుల్లో, కార్యకర్తల్లో రాజకీయ వేడి పుట్టించి కొత్త ఆశలు రేపడంలో విజయవంతమైంది.