ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్కు భూమి ఇవ్వకపోవడం వల్లే తుళ్లూరు మండలంలోని తమ చెరుకుతోటలను కాల్చేశారని బాధిత రైతులు గద్దె చంద్రశేఖర్, నుతక్కి సురేశ్ తెలిపారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్కు భూమి ఇవ్వకపోవడం వల్లే తుళ్లూరు మండలంలోని తమ చెరుకుతోటలను కాల్చేశారని బాధిత రైతులు గద్దె చంద్రశేఖర్, నుతక్కి సురేశ్ తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారులపై చర్యలు తీసుకోవాలని పోలీసు స్టేషన్లో ఫిర్యాదుచేస్తే.. పోలీసులు తమనే దోషులుగా మార్చి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని పిలిచి కాలిపోయిన చెరుకుతోటను చూపించినందుకు, పోలీసులు తమపై కక్ష గట్టారని, తమను వేధిస్తున్నారని వారు గురువారం విలేకరులకు చెప్పారు.
గత నెల 28 నుంచి ఈ నెల 4వ తేదీ వరకు తనను పోలీసులు నిర్బంధంలో ఉంచారని, ఐదు పోలీసు స్టేషన్లకు తిప్పి చిత్రహింసలకు గురిచేశారని బాధిత రైతు నుతక్కి సురేశ్ చెప్పారు. గద్దె చంద్రశేఖర్ చెప్పడం వల్ల తాను చెరుకుతోటను తగులబెట్టినట్లు బలవంతంగా చెప్పించారని, తాను చెప్పిన విషయాలను సెల్ఫోన్లో చిత్రీకరించారని ఆయన వివరించారు. తన ఆచూకీ కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు అవుతున్నదని తెలిసి.. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో తుళ్లూరు టీడీపీ జెడ్పీటీసీ సభ్యుడు నరేంద్రకు అప్పగించారని నుతక్కి సురేశ్ చెప్పారు.