కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరుకు వలసొచ్చిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
Feb 19 2017 11:47 PM | Updated on Sep 5 2018 2:26 PM
పామిడి: కరువు పరిస్థితుల నేపథ్యంలో బతుకుదెరువు కోసం ఊరుగాని ఊరుకు వలసొచ్చిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. అనంతపురం జిల్లా పామిడి మండలం సొరకాలయపేటలో ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా డోన్ మండలం దేవరబండ వాసి కుమ్మర మహేశ్(28) ఏడాది కిందట తన భార్య జయలక్ష్మీ, కుమార్తె రమాదేవి(9), కుమారుడు అరుణ్(6)తో కలిసి సొరకాయలపేటకు వలస వచ్చాడు. గ్రామానికి చెందిన పరమేశ్వర్రెడ్డి ఇంటిలో అద్దెకుంటూ ఆయనతో పాటు నాగభూషణం అనే రైతుకు చెందిన పదెకరాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేసుకుంటున్నాడు.
గ్రామానికి చెందిన జంగం నడిపి కోదండ, అతని కుమారులు మహేశ్ ఇంటి కాంపౌడ్లోని చెట్టును నరికివేశారు. చెట్టుకొమ్మలు విద్యుత్ తీగలపై పడటంతో అది తెగిపోయింది. గ్రామానికి సరఫరా అయ్యే విద్యుత్ డీపీని ఆఫ్ చేశామని, తెగిన విద్యుత్ సర్వీసును స్తంభానికి ఏర్పాటు చేయాలని కోదండ కోరడంతో మహేశ్ కాదనలేకపోయాడు. స్తంభం ఎక్కి సర్వీసు వైరు తగిలించేందుకు యత్నించగా ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురై కిందపడి మృతి చెందాడు. విషయం తెలిసి భార్య జయలక్ష్మీ సొమ్మసిల్లి పడిపోయింది. ఎస్ఐ రవిశంకర్రెడ్డి కేసు నమోదు చేసుకొని, మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
Advertisement


