కబడ్డీ ఆడుతున్న క్రీడాకారిణులు
పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజినల్ స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ పరిధిలోని యానాం, కరీంనగర్, కొప్పాల్, దవణగిరె, బెంగుళూరు, నెల్లూరు క్లస్టర్లకు చెందిన నవోదయ విద్యార్థులు పాల్గొంటున్నారు.
-
పాలేరు నవోదయలో రీజినల్స్థాయి కబడ్డీ పోటీల సందడి
-
ఐదు రాష్ట్రాల నుంచి తరలొచ్చిన విద్యార్థులు
-
క్రీడా స్ఫూర్తిని చాటాలి : డీఈఓ రాజేష్
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజినల్ స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండురోజుల పాటు జరిగే ఈ పోటీల్లో నవోదయ విద్యాలయ సమితి, హైదరాబాద్ పరిధిలోని యానాం, కరీంనగర్, కొప్పాల్, దవణగిరె, బెంగుళూరు, నెల్లూరు క్లస్టర్లకు చెందిన నవోదయ విద్యార్థులు పాల్గొంటున్నారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో బాల, బాలికలకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తున్నారు. డీఈఓ నాంపల్లి రాజేష్ ముఖ్య అతిథిగా హాజరై క్రీడా పతాకాన్ని ఎగురవేసి, క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. పాలేరు సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డితో కలిసి బెలూన్లను ఎగురవేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఈఓ మాట్లాడుతూ... విద్యార్థులకు విద్యతో సమనంగా క్రీడలు పేరును తీసుకొస్తాయని, క్రీడాస్ఫూర్తిని నింపుకోవాలని సూచించారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఎంతో గుర్తింపు ఉందని, పాలేరు వేదికగా భారీస్థాయిలో పోటీలు జరగడం సంతోషదాయకమని అన్నారు. సర్పంచ్ మాధవీరెడ్డి మాట్లాడుతూ..పాలేరు నవోదయలో రీజినల్ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించటం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ స్వర్ణలత, సీనియర్ ఫ్యాకల్టీ భారతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తొలిరోజు పాలేరు నవోదయ ప్రాంగణం మొత్తం కళకళలాడింది. వివిధ రాష్ట్రాల నుంచి తరలొచ్చిన విద్యార్థులు ఆట నైపుణ్యంతో అచ్చెరువొందేలా చేశారు. కబడ్డీ..కబడ్డీ కూతతో..క్రీడాకారులు హోరాహోరీగా తలపడ్డారు. విభాగాల వారీగా..ప్రతిభను చాటారు. ఈ పోటీలను విద్యాలయానికి చెందిన పీఈటీలు బాపూజీ, కామేశ్వరి ఆధ్వర్యంలో నిర్వహించారు.