
వైవిధ్యం.. గుడ్డం రంగనాథుడి ఆలయం
హిందూపురం పరిసరాల్లో అతిపురాతన ఆలయాల్లో ప్రముఖమైనది గుడ్డం రంగనాథస్వామి ఆలయం.
హిందూపురం పరిసరాల్లో అతిపురాతన ఆలయాల్లో ప్రముఖమైనది గుడ్డం రంగనాథస్వామి ఆలయం. 1488లో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. అప్పట్లో గుట్టమీద రంగనాథస్వామిగా పేరున్న ఈ ఆలయానికి కాలక్రమేణ గుడ్డం రంగనాథ స్వామి ఆలయంగా ఖ్యాతి గడించింది. ఆలయ చరిత్రను పరిశీలిస్తే.. పెనుకొండ నుంచి మైసూరుకు పయనమై వెళుతున్న శ్రీకృష్ణదేవరాయలు.. ఈ ప్రాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో ఇక్కడి కొండ గుహలో రంగనాథుడి శిలావిగ్రహాన్ని గుర్తించిన ఆయన పూజాదికాలు నిర్వహించారు.
తిరుగు ప్రయాణంలో కొండపై ఆ విగ్రహాన్ని ప్రతిష్టించి వెళ్లారు. సుమారు 50 అడుగుల ఎత్తులో గుట్టపై ఉన్న ఈ ఆలయానికి చేరుకునేందుకు మెట్ల దారి ఉంది. రంగనాథుడితోపాటు లక్ష్మీదేవిని కూడా ఇక్కడ కొలువై ఉన్నారు. 2001లో ఆలయాన్ని జీర్ణోద్ధారణ గావించారు. కొండపై ప్రత్యేకంగా చంద్రాలయం నిర్మించారు. రాష్ట్రంలో చంద్రుడికి ఆలయం ఉండడంతో ఇక్కడే. ఇంకా ఆలయ ఆవరణలో శివాలయంతో పాటు వివిధ దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి. ప్రతి ఏటా ఉగాది, శ్రావణ మాసాల్లో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో బ్రహ్మోత్సవాలు ఉంటాయి. ప్రతి నెలా మూడో ఆదివారం సాయంత్రం పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీపై శ్రీవారి ఉత్సవమూర్తులను అధిష్టింపజేసి గిరిప్రదక్షణ చేస్తారు. కొండ కింద కోనేరు, పక్కనే ఆహ్లాదకరమైన ఉద్యానవనం ఉన్నాయి.
- హిందూపురం అర్బన్