అధికారిక దోపిడీ | Sakshi
Sakshi News home page

అధికారిక దోపిడీ

Published Thu, Jun 16 2016 12:42 AM

Gravel excavation in Nakkavagu Ruling party leaders

* నక్కవాగులో యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకం
* అధికార పార్టీ నేతలకు కొమ్ముకాస్తున్న అధికారులు

అన్నపర్రు (పెదనందిపాడు): అధికార పార్టీ నేతలు ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను యథేచ్ఛగా తోలుకుంటున్నారు. దీనిని ఆపాల్సిన అధికారులు అధికార పార్టీ వారికే కొమ్ము కాస్తున్నారు. గతంలో అనుమతి లేకుండా గ్రావెల్ తోలుకున్నారని వైఎస్‌అర్ కాంగ్రెస్ పార్టీ నేతపై కేసు పెట్టించి జైలుకు పంపిన అధికారులు ప్రస్తుతం స్పందించటం లేదు.

ఎలాంటి అనుమతులు లేకుండా గ్రావెల్‌ను అమ్ముకుంటున్న అధికార పార్టీ నేతలను మాత్రం వారు పట్టించుకోవడం లేదు. మండల పరిధిలోని అన్నపర్రు గ్రామంలో ఉన్న నక్కవాగులో గ్రావెల్‌ను అధికార పార్టీ నేతలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గురించి  గ్రామస్థులు డ్రెయినేజి అధికారులకు సమాచారం అందించినా ప్రయోజనం శూన్యం. అధికారులు రేపు వస్తాం అంటూ.. వచ్చే ముందు అధికార పార్టీ నేతలకు సమాచారం ఇస్తున్నారు. దీంతో వారు వచ్చే సమయానికి ఆ ప్రదేశం ఖాళీగా మారుతుంది. ఈ ప్రభుత్వంలో సామాన్యులను న్యాయం జరగడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అరెస్టు ఇప్పుడు ఎందుకు చేయరు?
గ్రామానికి చెందిన ఎంపీటీసీ గ్రావెల్‌ను యథేచ్ఛగా అధిక ధరకు అమ్ముకుంటున్నారు. గతంలో పొలానికి కట్ట వేయటానికి గ్రావెల్‌ను తోలుకుంటే నాపై అక్రమంగా డ్రెయినేజి ఏఈ స్వాతి స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నన్ను జైలుకు కూడా పంపారు. ప్రస్తుతం అధికార పార్టీ నేతలు అనుమతులు లేకుండా యథేచ్ఛగా గ్రావెల్ అమ్ముకుంటున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహారిస్తున్నారు. వారిని ఎందుకు అరెస్టు చేయటం లేదు. ఇదేనా అధికారుల పని తీరు.
 - వైఎస్సార్‌సీపీ నాయకుడు కల్లూరి నాగేశ్వరరావు(నాగు)

Advertisement
Advertisement