
కాలువలో ముంచి.. కాలుతో తొక్కి..
భార్యపై అనుమానంతో తన పిల్లలను ఆదివారం కాలువలో ముంచి.. కాలుతో తొక్కి చంపేశాడో దుర్మార్గుడు.
- ఇద్దరు పిల్లలను చంపేసిన తండ్రి
- మరో చిన్నారిని కాపాడిన స్థానికులు
- భార్యపై అనుమానంతో ఘాతుకం
ఎడపల్లి/రెంజల్ : భార్యపై అనుమానంతో తన పిల్లలను ఆదివారం కాలువలో ముంచి.. కాలుతో తొక్కి చంపేశాడో దుర్మార్గుడు. ఇలా ఇద్దరు పిల్లలను చంపేయగా.. మూడో చిన్నారిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట సమీపంలో జరిగింది. జిల్లాలోని రెంజల్ మండలం నీల గ్రామానికి చెందిన గౌరాడి చంద్రశేఖర్కు ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం కుబీర్ గ్రామానికి చెందిన ప్రమీలతో పన్నెండేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి పిల్లలు సాత్విక్ (10), మోక్ష (5) పోమేష్ (13 నెలలు) ఉన్నారు. వారి చదువు నిమిత్తం ఐదు నెలలగా వీరు నిజామాబాద్ నగరంలోని చంద్రశేఖర్ కాలనీలో ఉంటున్నారు.
చంద్రశేఖర్ ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పనిచేస్తున్నాడు. అయితే, తాగుడుకు బానిసైన చంద్రశేఖర్ భార్యపై అనుమానం పెంచుకున్నాడు. పిల్లలు తనకు పుట్టలేదని తరుచూ భార్యను వేధించేవాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం భార్యతో గొడవ పడి ఇంటినుంచి వెళ్లగొట్టాడు. పిల్లలను చంపాలని నిర్ణయించుకున్న చంద్రశేఖర్ సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎడపల్లి మండలం జానకంపేట లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం సమీపంలో గల డి-40 నిజాంసాగర్ కాలువకు తీసుకువచ్చాడు. ముగ్గురు పిల్లలను స్నానం చేద్దామని నమ్మించి వారి బట్టలను విప్పి కాలువలోకి తీసుకెళ్లాడు.
ముందుగా పెద్ద పిల్లలు సాత్విక్, మోక్షలను నీటి బురదలో ముంచి.. కాలుతో తొక్కి చంపాడు. పెట్రోలింగ్లో ఉన్న ఇరువురు కానిస్టేబుళ్లు పిల్లల అరుపులు విని.. అటువైపు వెళ్లి చూడగా చంద్రశేఖర్ ఇద్దరు పిల్లలను నీటిలో ఉంచి తొక్కడాన్ని గమనించారు. కానిస్టేబుళ్లు అరుస్తుండగానే చిన్న కొడుకు పోమేష్ను నీటిలో వేసి తొక్కాడు. స్థానిక యువకులను అప్రమత్తం చేసిన కానిస్టేబుళ్లు పిల్లలను రక్షించారు. పిల్లలను నీటిలోంచి తీయగా సాత్విక్, మోక్ష అప్పటికే ప్రాణాలు విడిచారు. కొన ఊపిరితో ఉన్న పోమేష్ను స్థానిక యువకులు ప్రశాంత్, గణేష్, గోపి నీటి నుంచి కాలువ ఒడ్డుకు తీసుకొచ్చి హుటాహుటిన జానకంపేట ఆసుపత్రికి బైకుపై తీసుకెళ్లి చికిత్స అందించారు.