కేన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి | develops to cancer hospital | Sakshi
Sakshi News home page

కేన్సర్‌ ఆస్పత్రిని అభివృద్ధి చేయాలి

Aug 26 2016 10:49 PM | Updated on Aug 13 2018 6:24 PM

అనంత శివారులోని కేన్సర్‌ ఆస్పత్రిని సీపీఐ నేతల బృందం శుక్రవారం పరిశీలించింది.

- ఆస్పత్రిని పరిశీలించిన సీపీఐ జిల్లా నేతలు
అనంతపురం: అనంత శివారులోని కేన్సర్‌ ఆస్పత్రిని సీపీఐ నేతల బృందం శుక్రవారం పరిశీలించింది. ఆస్పత్రి అందిస్తున్న  వైద్య సేవలు, ఎలాంటి లోపాలున్నాయి, ఇంకా ఎలాంటి వైద్య పరికరాలు కావాలన్న విషయాలను వైద్యులు, రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి జగదీష్‌ మాట్లాడారు. క్యాన్సర్‌ ఆస్పత్రి జిల్లా కేంద్రంలో ఉందంటే చాలా సంతోషించామని తెలిపారు. ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మెడికల్‌ కళాశాల ఆవరణలో మంచి అధునాతన భవనాలు ఉన్నా కేన్సర్‌ వ్యాధికి చికిత్స అందించేందుకు సరైన వైద్యులు, సిబ్బంది లేరన్నారు.

వ్యాధి నిర్థారణకు అవసరమైన అధునాతన రేడియేషన్‌ మిషన్, ఆపరేషన్‌ థియేటర్, మెమోగ్రాఫ్, ఎక్స్‌రే, సిటీస్కాన్, ఎంఆర్‌ఐ, పెట్‌స్కాన్, రక్త పరీక్షలు అంబులెన్స్‌ తదితర మిషన్‌లు ఆస్పత్రిలో లేవన్నారు. కేవలం ఇద్దరు డాక్టర్లు, ఒక  టెక్నీషియన్ మాత్రమే ఉన్నారన్నారు. దీంతో రోగులకు వారు మెరుగైన సేవలందించడం ఎలా సాధ్య పడుతుందని అన్నారు. కేన్సర్‌ ఆస్పత్రిలోనే సర్జికల్‌ అంకాలజిస్ట్, మెడికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్లను తక్షణం నియమించేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు. నగర కార్యదర్శి సి.లింగమయ్య, అల్లీపీరా, ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రాజేష్‌గౌడ్, మహిళా సమాఖ్య నగర అధ్యక్ష, కార్యదర్శులు పద్మావతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement