బంకులు అడ్డాగా క’మిషన్‌’ వ్యాపారం | comition business | Sakshi
Sakshi News home page

బంకులు అడ్డాగా క’మిషన్‌’ వ్యాపారం

Dec 24 2016 11:33 PM | Updated on Sep 22 2018 7:50 PM

బంకులు అడ్డాగా క’మిషన్‌’ వ్యాపారం - Sakshi

బంకులు అడ్డాగా క’మిషన్‌’ వ్యాపారం

నగదు రహిత లావాదేవీల పేరిట కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ఏర్పాటు చేసిన కొన్ని స్వైపింగ్‌ మెషిన్లు నిలువునా దోచేస్తున్నాయి. రూ.10 వేలు నగదు కావాలని వెళితే.. రూ.1000 తినేస్తున్నాయి. ఇందుకు ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలోని ఒక పెట్రోల్‌ బంకు ఉదాహరణగా నిలుస్తోంది.

నగదు రహిత లావాదేవీల మాటున కొత్త దోపిడీ
 సొమ్ము పొందాలంటే 10 శాతం వదులుకోవాల్సిందే
ద్వారకాతిరుమల :
నగదు రహిత లావాదేవీల పేరిట కొన్ని పెట్రోల్‌ బంకుల్లో ఏర్పాటు చేసిన కొన్ని స్వైపింగ్‌ మెషిన్లు నిలువునా దోచేస్తున్నాయి. రూ.10 వేలు నగదు కావాలని వెళితే.. రూ.1000 తినేస్తున్నాయి. ఇందుకు ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లిలోని ఒక పెట్రోల్‌ బంకు ఉదాహరణగా నిలుస్తోంది. నగదు అవసరమైన వ్యక్తులకు వారి ఖాతానుంచి స్వైపింగ్‌ మెషిన్‌ ద్వారా నగదు బదిలీ చేసుకుని సొమ్ము ఇస్తున్నారు. అయితే, ఖాతాదారు పొందే సొమ్ముపై 10 శాతం అదనంగా తీసుకుంటున్నారు. మండలంలోని తక్కెళ్లపాడుకు చెందిన ఆనుపోజు త్యాగాచారి అనే వ్యక్తి నగదు అత్యవసరం కావడంతో డెబిట్‌ కార్డు తీసుకుని ఈ బంకుకు వచ్చాడు. స్వైపింగ్‌ మెషిన్‌ ద్వారా తన అకౌంట్‌లోని రూ.20 వేలను బదిలీ చేసుకుని, ఆ మొత్తం ఇవ్వాలని కోరాడు. క్షణాల్లో రూ.20 వేలు ఇచ్చిన బంకు నిర్వాహకులు అతని అకౌంట్‌ నుంచి రూ.22 వేలను బంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. ఇదేమని అడిగితే.. తాము ఐసీఐసీఐ బ్యాంక్‌ ఇచ్చిన స్వైపింగ్‌ మెషిన్‌ వాడుతున్నామని, నూటికి 10 శాతం కమీషన్‌ ఆ బ్యాంకుకు వెళుతుందని చావు కబురు చల్లగా చెప్పారు. ఎన్ని లక్షలు కావాలన్నా ఇస్తామని, 10 శాతం కమీషన్‌ నిబంధన మాత్రం వర్తిస్తుందని సెలవిచ్చారు. దీంతో లబోదిబోమనడం త్యాగాజారి వంతైంది. గుణ్ణంపల్లికి చెందిన కె.సుబ్బారెడ్డికి కూడా ఇక్కడ ఇదే అనుభవం ఎదురైంది. ఆయన కూలీలకు సొమ్ము చెల్లించేందుకు నాలుగు రోజుల క్రితం ఈ బంకులో రూ.20 వేలను పొందాడు. అప్పుడు కూడా 10 శాతం కమీషన్‌ను వసూలు చేశారు.
 
ఇంత దారుణమా
గుణ్ణంపల్లిలోని పెట్రోల్‌ బంకుకు వెళ్లి నా ఖాతాలోని నగదును బదిలీ చేసుకుని రూ.20 వేలు చేతికివ్వమని అడిగాను. స్వైపింగ్‌ మెషిన్‌ ద్వారా నా అకౌంట్‌లోంచి రూ.22 వేలు తీసుకుని.. నాకు రూ.20 వేలు ఇచ్చారు. ఇదేమని అడిగితే.. ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు తప్ప ఇతరులు ఎవరు సొమ్ము తీసుకున్నా ఇంతేనన్నారు. అయినా అన్ని కొత్తనోట్లు వారికెలా వచ్చాయి. ఇలాంటి ఖాతాలపై నిఘా ఉండదా. 
 అనుపోజు త్యాగాచారి, తక్కెళ్లపాడు
 
ఇంత దారుణమా 
బ్యాంకులకు వెళ్లినా అవసరమైనంత నగదు ఇవ్వకపోడంతో ఇలా నష్టపోవాల్సి వస్తోంది. మొన్నటివరకూ పాత నోట్లతో కమీషన్‌ వ్యాపారాలు చేశారు. ఇప్పుడు ఏకంగా కొత్తనోట్లతోనూ వ్యాపారం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం గుణ్ణంపల్లి పెట్రోల్‌ బంకులో 10 శాతం కమీషన్‌ ఇచ్చి సొమ్ములు పొందాను. ఇంత దారుణం ఎక్కడా చూడలేదు. 
 కె.సుబ్బారెడ్డి, గుణ్ణంపల్లి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement