మహిళ హత్య; 18వ అంతస్తు నుంచి కిందకు

Woman Killed And Pushed Off 18th Floor In Noida - Sakshi

నోయిడా: మహిళను హత్య చేసి ఆపై దాన్ని ఆత్మహత్యలా సృష్టించాలనుకున్నాడు ఓ దుర్మార్గుడు. అయితే పోలీసుల ముందు అతని  వేషాలు ఎక్కువ సేపు నిలబడలేక పోయాయి. దర్యాప్తులో నిందితుడి బండారం అంతా బయటపడింది. అనుమానాస్పద రీతిలో గుర్తు తెలియని మహిళ మరణించినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్‌ నోయిడాలో చోటుచేసుకుంది. ఏవీజే హైట్స్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి హత్యకు పూనుకొని అనంతరం ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని 18వ అంతస్తు నుంచి కిందకు తోసి ఆత్మహత్యలా చిత్రీకరించాలనుకున్నాడు. కాగా ఈ ఘటన శనివారం రాత్రి జరిగిందని, ఆదివారం ఉదయం మహిళ మృతదేహాన్నిఅపార్ట్‌మెంట్‌ సెక్యూరిటీ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. 

అదే భవనంలో ఉన్న వ్యక్తే ఈ దారుణానికి పాల్పడినట్లు అనుమానించిన పోలీసులు.. నిందితుడు సదరు అపార్టుమెంట్‌లోనే 18వ అంతస్తులో నివసిస్తున్న ముంతాజ్‌ ఖాన్‌గా గుర్తించారు. అంతేగాక ప్రమాదం చోటుచేసుకున్నప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ టీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. నిందితుడు ముంతాజ్.. మహిళను రెండు, మూడు రోజుల క్రితమే ఫ్లాట్‌కు తీసుకువచ్చినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అలాగే ముంతాజ్‌ బిహార్‌ రాష్ట్రానికి  చెందినవాడుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇతని బంధువులు కూడా అదే అపార్ట్‌మెంట్‌లో వేరే ఫ్లాట్ లో నివసిస్తున్నారని, వారిని సైతం ప్రశ్నిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top