బాలికపై అత్యాచార యత్నం
సాక్షి, కర్నూలు(ఎమ్మిగనూరు రూరల్) : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని పోలీస్స్టేషన్ ఎదుటనున్న ఉషా ఫ్యామిలీ రెస్టారెంట్ వెనక శుక్రవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన పదేళ్ల బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి ప్రయత్నించాడు. బాలిక తలను గోడకు కొట్టి అత్యాచారం చేయబోగా.. ఆ చిన్నారి కేకలు వేయటంతో అతను పారిపోయాడు. రక్త గాయాలతో పడి ఉన్న బాలికను అక్కడ పనిచేసే కొందరు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టౌన్ సీఐ శ్రీధర్, పట్టణ ఎస్ఐ శ్రీనివాసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని, నిందితున్ని త్వరలోనే పట్టుకుంటామని సీఐ శ్రీధర్ తెలిపారు.