వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు ఆత్మహత్య

Three Womens Committed Suicides In Different Situation In Ranga Reddy - Sakshi

భర్త వేధింపులతో భార్య..

రెండేళ్ల తర్వాత రెండు నెలల క్రితమే కాపురానికి వచ్చిన మహిళ 

మొయినాబాద్‌(చేవెళ్ల) : పదకొండేళ్లు భర్త వేధింపులను భరించింది. అయినా భర్తలో మార్పు రాకపోగా వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఓ వివాహిత భరించలేక తనువు చాలించింది. ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని కనకమామిడి గ్రామానికి చెందిన చనుగొముల శ్రీనివాస్‌కు సరూర్‌నగర్‌ మండలం నాదర్‌గుల్‌కు చెందిన అరుణ(30)ను ఇచ్చి 11 సంవత్సరాల క్రితం వివాహం జరిపించారు. వీరికి కూతురు తేజ(8), కొడుకు సోను(6) ఉన్నారు. కొంతకాలం పాటు వారి కాపురం సాఫీగానే సాగింది.

ఆ తరువాత భర్త శ్రీనివాస్‌ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగడంతో పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినా వారి తీరులో మార్పు రాలేదు. దీంతో రెండేళ్ల క్రితం అరుణ.. భర్త, పిల్లలను వదిలి తల్లిగారింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రీనివాస్‌ మొయినాబాద్‌ మండల కేంద్రంలోని విజయనగర్‌ కాలనీలో ఇస్త్రీ డబ్బా పెట్టుకుని జీవిస్తున్నాడు. కాగా గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు సర్ది చెప్పడంతో రెండు నెలల క్రితం అరుణ మళ్లీ భర్త వద్దకు చేరుకుంది. విజయనగర్‌కాలనీలోనే ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కాగా శుక్రవారం భార్యాభర్తల మధ్య మళ్లీ గొడవ జరిగింది.

శుక్రవారం రాత్రి పిల్లలతో కలిసి ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్‌ పాల ప్యాకెట్‌ తేవడానికి ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అరగంట తరువాత తిరిగి వచ్చాడు. అప్పటికే అరుణ చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అప్పటికీ పిల్లలు నిద్ర లేవలేదు. గమనించిన చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

కడుపునొప్పితో నవ వధువు..
తాండూరు రూరల్‌: కడుపునొప్పి భరించలేక ఓ నవ వధువు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని నారాయణపూర్‌లో గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. కరన్‌కోట్‌ ఎస్సై రేణుకారెడ్డి కథనం ప్రకారం... నారాయణపూర్‌ గ్రామానికి చెందిన కుర్వ జ్యోతి(24)ని తాండూరు మండలం చంద్రవంచ గ్రామానికి చెందిన శ్రీనివాస్‌కు ఇచ్చి మూడు నెలల క్రితం వివాహం చేశారు. కొన్ని రోజులుగా జ్యోతి కడుపునొప్పితో బాధపడుతోంది. ఏరువాక పండుగ సందర్భంగా జ్యోతి తన భర్త శ్రీనివాస్‌తో కలిసి పుట్టిళ్లు అయిన నారాయణపూర్‌కు వచ్చింది. కడుపునొప్పి భరించలేక జ్యోతి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగింది. వెంటనే  ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జ్యోతి శనివారం ఉదయం మృతి చెందింది. జ్యోతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

కడుపునొప్పికి తాళలేక యువకుడు.. 
శంకర్‌పల్లి: కడుపునొప్పి భరించలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలకేంద్రంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. సీఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. శంకర్‌పల్లి పట్టణ కేంద్రానికి చెందిన ప్రవీణ్‌గౌడ్‌(22) కుటుంబ సభ్యులతో కలిసి రిత్విక్‌ వెంఛర్‌లో ఉంటాడు. గత కొన్ని రోజుల నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండేవాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి 10గంటల సమయంలో ఉరి వేసుకున్నాడు. చుట్టు పక్కల వారు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోరున విలపించారు. తండ్రి వెంకటేష్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top