సోదరుడి పైశాచికత్వం; ఆవేదనతో..
జైపూర్ : వరుసకు చెల్లెలు అయ్యే బాలికపై కన్నేసాడో కామాంధుడు. వావి వరసలు మరచి ఆమెపై అత్యాచారానికి పాల్పడి మానవత్వానికి మచ్చ తెచ్చాడు. ఈ అమానుష ఘటన రాజస్తాన్లోని శ్రీ గంగానగర్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..తారారాం అనే వ్యక్తి వరుసకి సోదరి అయ్యే బాలికపై తరచుగా అకృత్యానికి పాల్పడేవాడు. ఈ తతంగాన్నంతా వీడియోలు తీసి రాక్షసానందం పొందేవాడు. తారారాం భార్య, తండ్రి కూడా ఇందుకు సహకరించేవారు. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే ఈ వీడియోలను పోర్న్ సైట్లలో అప్లోడ్ చేస్తామంటూ బాధితురాలిని బెదిరించేవాడు. దీంతో ఆవేదన చెందిన సదరు బాలిక ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది.
ఈ క్రమంలో అసలు విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏసీపీని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రస్తుతానికైతే ఎలాగోలా తమ కూతురిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుకోగలిగామని, నిందితుడికి సరైన శిక్ష పడకపోతే ఆమె మరోసారి అఘాయిత్యానికి పాల్పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడు తారారాం, అతడికి సహకరించిన భార్య, తండ్రి రాజారాంలను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.