పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్‌ రుణాలే ముంచాయ్‌! | PMC HDIL loan 73% of total loan book says ex-MD Thomas letter to RBI | Sakshi
Sakshi News home page

పీఎంసీ స్కాం : హెచ్‌డీఐఎల్‌ రుణాలే ముంచాయ్‌!

Sep 30 2019 8:39 AM | Updated on Sep 30 2019 12:19 PM

PMC HDIL loan 73% of total loan book says ex-MD Thomas letter to RBI - Sakshi

ముంబై: పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కోపరేటివ్‌  (పీఎంసీ) బ్యాంకు సంక్షోభానికి... రియల్‌ ఎస్టేట్‌ సంస్థ హెచ్‌డీఐఎల్‌కు బ్యాంకు భారీగా రుణాలను సమర్పించుకోవడమేనని వెల్లడైంది. పీఎంసీ బ్యాంకు మొత్తం రుణ ఆస్తులు రూ.8,800 కోట్లు కాగా, ఇందులో రూ.6,500 కోట్లకు పైగా ఒక్క హెచ్‌డీఐఎల్‌కే ఇవ్వడం జరిగినట్టు సస్పెండైన బ్యాంకు ఎండీ జాయ్‌థామస్‌ అంగీకరించినట్టు సమాచారం. అంటే రుణ ఆస్తుల్లో 73 శాతాన్ని ఒకే ఖాతాకు బ్యాంకు ఎలా ఇచ్చిందన్నది పెద్ద ప్రశ్న. ఆర్‌బీఐ నిబంధనలకు వ్యతిరేకం ఇది. ఆర్‌బీఐ నిర్దేశించిన పరిమితి కంటే నాలుగు రెట్లు ఎక్కువ.   పీఎంసీ చైర్మన్‌ వర్యమ్‌సింగ్‌ను గతేడాదే తొలగించాలని, మహారాష్ట్ర రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కోపరేటివ్‌ సొసైటీస్‌కు ఆర్‌బీఐ సూచించింది.  కానీ, బ్యాంకు చైర్మన్‌గా సింగ్‌ ఇటీవలి కాలం వరకు కొనసాగారు. 

‘దిద్దుబాటు చర్యల’ చట్రంలోకి ఎల్‌వీబీ  
లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ‘తక్షణ దిద్దుబాటు చర్యల’(పీఎంసీ) అస్త్రాన్ని ప్రయోగించింది.  అధిక మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారం, ఇబ్బందుల నిర్వహణకు తగిన మూలధన పెట్టుబడులు లేకపోవడం, రుణాలపై ప్రతికూల రిటర్న్స్‌ వంటి అంశాలు దీనికి కారణం. మోసం, నిధుల దుర్వినియోగం ఆరోపణలతో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ బోర్డ్‌పై ఢిల్లీ పోలీస్‌ ఆర్థిక నేరాల విభాగం ఫిర్యాదు దాఖలైంది.

Advertisement
 
Advertisement
Advertisement