బిడ్డలతో తల్లి ఆత్మహత్య

mother commit to suicide with two children - Sakshi

ఇద్దరు బిడ్డలు సహా తల్లి బలవన్మరణం

పిల్లల తండ్రి, బంధువుల రోదనలు

శోకసంద్రంలో చెడుగుట్లపల్లె

ఓ తల్లి మానసిక రోగంతో బాధపడుతోంది..కూలీనాలి చేసుకునే భర్త ఆమెను ఆస్పత్రులకు తిప్పుతున్నా నయం కాలేదు. ఆదివారం తిరుపతి రుయాకు తీసుకురావాలని భావించాడు. అంతలోనే ఆమె మానసిక కల్లోలానికి లోనైంది. జీవితాన్నే అంతం చేసుకుంది... ముక్కు పచ్చలారని ఇద్దరు పసిబిడ్డలను తీసుకుని వ్యవసాయ చెరువులో దూకింది.. ముగ్గురూ విగతజీవులై తేలారు.. ఈ హృదయ విదారక ఘటన చౌడేపల్లి మండలం చెడుగుట్లపల్లెలో శనివారం చోటుచేసుకుంది.

చౌడేపల్లె :  ఆ తల్లికి ఏం కష్టమో ... ఏమో కానీ రక్తం పంచుకుని పుట్టిన ఇద్దరు బిడ్డలను నీటిపాలుచేసి... ఆమె కూడా బలవన్మరణానికి పాల్పడింది. పేద కూలీ ఇంట పెనువిషాదం నింపిన ఈ సంఘటన చౌడేపల్లె మండలం పెద్దయల్లకుంట్ల పంచాయతీ చెడుగుట్లపల్లె వద్ద శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఆ గ్రామానికి చెందిన  పి. వసంతకుమారి(27) బిడ్డలు అఖిల్‌(4), హర్షిత(2)ను గ్రామానికి సమీపంలోని జంగంవానికుంట వద్ద గల ఫాంపాండ్‌ గుంతలో పడేసి ఆత్మహత్యకు పాల్పడటం గ్రామస్తులను కలచివేసింది. ఆ గ్రామం శోకసముద్రమైంది. చెడుగుట్లపల్లెకు చెందిన ఓబులప్ప పెద్ద కుమార్తె  పి. వసంతకుమారి, నిమ్మనపల్లె మండలం అగ్రహారానికి చెందిన గంగాధర ఐదేళ్ల క్రితం పెళ్లాడారు.

గంగాధర తల్లిదండ్రులు మృతిచెందడంతో అత్తగారింట్లోనే ఉంటూ కూలిపనులు చేసి జీవనం సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా వసంతకుమారి మతిస్థిమితం లేకుండా బాధపడుతోంది. వైద్యసేవలందిస్తే కుదుటపడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఎప్పుడూ బిడ్డలను ప్రేమగా చూసుకునే ఆమె, వారితో కలిసి బలవన్మరణానికి పాల్ప డటమేంటని గ్రామస్తులు, బంధువులు భోరున విలపిస్తున్నారు. బిడ్డలు, భార్య మృతదేహాల వద్ద గంగాధర, అతని కుటుంబీకులు కన్నీరుమున్నీరుకావడం చూపరులను కలచివేసింది. అఖిల్, హర్షిత మృతదేహాలను చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top