ఆ ఐదుగురిని చంపింది అతడే!
ఢిల్లీలోని భజన్పురాలో సామూహిక మరణాల్లో వీడిన మిస్టరీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఒకే కుంటుంబానికి చెందిన ఐదుగురి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బు కోసమే అతడు ఈ దారుణానికి పాల్పడినట్లు అంగీకరించాడని వెల్లడించారు. వివరాలు... ఈశాన్య ఢిల్లీలోని భజన్పురాలోని ఓ ఇంట్లో ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు బుధవారం పోలీసులకు సమాచారం అందింది. ఈ క్రమంలో తలుపులు బద్దలుకొట్టి శవాలను బయటకు తీసి.. పోలీసులు పోస్ట్మార్టం కోసం మార్చురీకి పంపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసలు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ప్రభు అనే వ్యక్తి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేల్చారు. (ఆ ఇంట్లో అనుమానాస్పదంగా ఐదు శవాలు)
కాగా మృతిచెందిన వ్యక్తులను శంభు చౌదరి కుటుంబంగా పోలీసులు గుర్తించారు. శంభు చౌదరి ఈ-రిక్షా నడుపుతూ.. భార్య సునీత, ముగ్గురు పిల్లల్ని పోషించేవాడు. ఈ క్రమంలో శంభుకు మామ వరుసయ్యే ప్రభు.. శంభు వద్ద రూ. 30 వేలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని తిరగి ఇవ్వాలని శంభు చౌదరి తన మామ ప్రభును కోరాడు. ఈ క్రమంలో ఇరువురు పలుమార్లు గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో డబ్బులు తిరిగి ఇవ్వలేనని భావించిన ప్రభు.. శంభు చౌదరిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం శంభు చౌదరి( 43), అతని భార్య సునిత( 37), ఇద్దరు కుమారులు శివం(17) , సచిన్ (14) , కుమార్తె కోయల్( 12) లను ప్రభు హత్య చేశాడు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించాడు. కాగా బిహార్లోని సుపాల్ జిల్లాకు చెందిన శంభు.. ఆర్నెళ్ల క్రితం కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చి అద్దె ఇంట్లో దిగాడు. ఈ క్రమంలో కుటుంబం మొత్తం మృత్యువాత పడటంతో వారి బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.