ప్రేమ వివాదం.. ప్రియుడ్ని దారుణంగా..
చెన్నై : కోట్టకుప్పంలో ప్రేమికుడిని హతమార్చి కాల్చివేసిన కేసులో ప్రియురాలి అన్న, మేనమామ సహా ఏడుగురిని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు జరిపిన విచారణలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. పుదుచ్చేరి సమీపంలోగల పెరియ కోట్టకుప్పం ప్రాంతానికి చెందిన శంకర్ కుమారుడు రాఘవన్ (22). ఇతను బెంగళూరులోని టైల్స్ కంపెనీలోఉద్యోగి. పెరియ కోట్టకుప్పం ప్రాంతంలోని ఒక నర్సింగ్ విద్యార్థిని అరుణ (19)ను ప్రేమిస్తూ వచ్చాడు. ఈ వ్యవహారం అరుణ ఇంట్లో తెలియడంతో తల్లిదండ్రులు ఖండించారు.
దీంతో విరక్తిచెందిన అరుణ గత 22న ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై అరుణ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెరియ కోట్టకుప్పం పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. అరుణ మృతి గురించి బెంగళూరులో ఉన్న రాఘవన్కు తెలియడంతో అతను ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇలావుండగా సోమవారం కోట్టకుప్పం బస్టాండ్ వద్ద రాఘవన్ను అతడి మిత్రుడు శివనేశన్ను సంజయ్ అనే వ్యక్తి తన బైక్లో తీసుకువెళ్లాడు. కోట్టకుప్పం ఈస్ట్కోస్ట్ రోడ్డులో వారు వెళుతుండగా నాలుగు బైక్లలో వచ్చిన ఏడుగురు వ్యక్తులు రాఘవన్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తర్వాత ఒంటిపై పెట్రోలు కుమ్మరించి తగలబెట్టి వెళ్లారు. దీనిగురించి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరిపారు. ఈ విచారణలో అరుణ అన్న, మేనమామ, అతని కుమారుడు రాఘవన్ను హతమార్చినట్లు కనుగొన్నారు.
పుదుచ్చేరి కురసుకుప్పంకు చెందిన సంజయ్ సహకరించినట్లు తెలిసింది. ప్రేమ వివాదంలో అరుణ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రేమికుడు రాఘవన్ను హతమార్చేందుకు అరుణ అన్న అరుణ్కుమార్ (22) మేనమామ కుట్ట రమేష్ అలియాస్ పద్మనాభన్, పద్మనాభన్ కుమారుడు దినేష్ అలియాస్ ప్రవీణ్కుమార్, అరుణ పెదమ్మ కుమారుడు రంజిత్కుమార్ సూచనల మేరకు తొట్టాకుచ్చి ప్రకాష్, సామిపిళ్లైతోట్టం సంతోష్, బాలాజి రాఘవన్ను హతమార్చేందుకు పథకం పన్ని రాఘవన్తో పనిచేసిన సంజయ్ ద్వారా రాఘవన్ను హతమార్చారు. గుర్తు తెలియకుండా ఉండేందుకు శవంపై పెట్రోలు పోసి కాల్చివేశారు. రాఘవన్ హత్యకు సంబంధించి కుట్ట రమేష్ మినహా మిగతా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తర్వాత వానూరు కోర్టులో హాజరుపరిచి కడలూరు సెంట్రల్ జైలులో ఉంచారు. ముందుగా వారి నుంచి మూడు కత్తులు, బైక్లు స్వాధీనం చేసుకున్నారు.