భార్య ప్రియుడిని హత్య చేసిన భర్త | Husband Killed Wife Lover in Tamil Nadu | Sakshi
Sakshi News home page

భార్య ప్రియుడిని హత్య చేసిన భర్త

Mar 13 2019 1:33 PM | Updated on Mar 13 2019 1:33 PM

Husband Killed Wife Lover in Tamil Nadu - Sakshi

తిరువొత్తియూరు: శ్రీపెరంబదూరు, మణిమంగళంకు చెందిన బాలాజీ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య వనిత (25). వీరికి ఏడాదిన్నర కొడుకు ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన గణపతి (36) బాలాజీకి బంధువు. దీని వల్ల తరచూ బాలాజీ ఇంటికి వచ్చి వెళుతుండేవాడు. ఈ క్రమంలో గణపతికి వనితతో పరిచయం పెరిగి క్రమంగా వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న బాలాజీ భార్యను మందలించాడు. కాని ఆమె ప్రవర్తనలో మార్పురాలేదు.

ఈ క్రమంలో గత వారం వనిత హఠాత్తుగా అదృశ్యమైంది. ఆమె ప్రియుడు గణపతితో కలిసి పారిపోయినట్టు తెలిసింది. వారిద్దరూ శ్రీ పెరంబదూరు, గుండు పెరుంబేడులోని అద్దె ఇంటిలో ఉంటున్నట్టు తెలిసింది. ఈ సంగతి తెలుసుకున్న బాలాజీ వారిని కడతేర్చడానికి నిర్ణయించుకున్నాడు. మంగళవారం తెల్లవారుజామున తన సహచరులతో కలిసి గుండు పెరుంబేడుకు వెళ్లాడు. భార్య, ప్రియుడు ఉంటున్న ఇంటిలోకి చొరబడి గణపతిని చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు. అడ్డువచ్చిన భార్య వనితకు కత్తివేటు పడింది. దాడిలో తీవ్ర గాయాలైన గణపతి అక్కడిక్కడే మృతి చెందాడు. అనంతరం హంతకులు అక్కడి నుంచి పారిపోయారు. శబ్దం విన్న ఇరుగుపొరుగు ప్రజలు అక్కడికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న వనితను చెంగల్పట్టు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న చెంగల్పట్టు పోలీసులు కేసు నమోదు చేసి గణపతి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ హత్య కేసుకు సంబంధించి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement