ఆడపిల్ల పుట్టిందని..

Father Killed Baby Daughter At Chennai - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆడపిల్లగా పుట్టడమే ఆమె పాలిట శాపమైంది. మగబిడ్డే కావాలని పంతం పట్టిన కన్నతండ్రే ఆమె పాలిట యముడయ్యాడు. 15 రోజుల వయసు పసికూనను కర్కశంగా సజీవ సమాధి చేశాడు. ఈ దారుణం తమిళనాడులో చోటుచేసుకుంది. విల్లుపురం జిల్లా వడమారుతూర్‌ గ్రామానికి చెందిన వరదరాజన్‌ (29), సౌందర్య (22)లకు 14 నెలల క్రితం వివాహమైంది. 15 రోజుల క్రితం సౌందర్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సోమవారం అర్థరాత్రి సమయంలో చడీ చప్పుడు లేకుండా నిద్ర పోతున్న శిశువును వరదరాజన్‌ సమీపంలోని ఆడవిలోకి తీసుకెళ్లి గుంతలో పూడ్చిపెట్టాడు. కొద్ది సేపటి తర్వాత నిద్రలేచిన సౌందర్య బిడ్డ కనపడక పోవడంతో భర్తను అడగ్గా తనకేం తెలుసంటూ బుకాయించాడు. కుటుంబ సభ్యులంతా శిశువు కోసం వెదుకుతుండగా పాద ముద్రలు కనిపించాయి. వాటిని అనుసరిస్తూ అడవిలోకి వెళ్లి, గుంత తవ్వారు. ఆ శిశువు అప్పటికే చనిపోయి ఉంది. గర్భం దాల్చిన నాటి నుంచి మగబిడ్డే కావాలి, ఆడబిడ్డ పుడితే చంపేస్తానంటూ భర్త తనను బెదిరించేవాడని సౌందర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ జరిపి వరదరాజన్‌ను అరెస్ట్‌ చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top