క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Cricket Betting Gang Arrest in Guntur - Sakshi

సబ్‌బుకీతో పాటు మరో ముగ్గురు ఫండర్స్‌ అరెస్టు

నిందితులందరూ మంగళగిరి వాసులే

రూ.5.60 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ సీజ్‌

గుట్టురట్టు చేసిన అధికారులు, సిబ్బందికి క్యాష్‌ రివార్డులు

వివరాలు వెల్లడించిన ఎస్పీ సీహెచ్‌ విజయారావు

గుంటూరు: గతంలో మాదిరిగా కమ్యూనికేటర్‌ బాక్స్‌ లేకుండా కొద్ది మందితో మాత్రమే రహస్యంగా క్రికెట్‌ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్న నలుగురిని స్థానిక పోలీసులు, స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందం సభ్యులు సంయుక్తంగా దాడులు చేసి అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అర్బన్‌ ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సీహెచ్‌ విజయారావు వివరాలు వెల్లడించారు. మంగళగిరికి చెందిన వ్యక్తి ఈనెల 15న మంగళగిరిలో క్రికెట్‌ బెట్టింగ్‌లు జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశాడు.

దీంతో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్, మంగళగిరి పోలీసులను అప్రమత్తం చేశారు. మంగళగిరికి చెందిన  సబ్‌బుకీ ఎం.నరేష్, ఫండర్స్‌ ఎం.శ్రీకాంత్, ఆర్‌ వెంకటేశ్వరరావు, పి.నాగార్జున సోమవారం పార్క్‌ రోడ్డులో ఉన్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు అంగీకరించడంతో వారి వద్ద ఉన్న రూ.5.60 లక్షల నగదు, 6 సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌ను స్వాధీనం చేసుకున్నారని ఎస్పీ తెలిపారు. బెట్టింగ్‌ ముఠాను అదుపులోకి తీసుకున్న అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించి వారికి క్యాష్‌ రివార్డు అందచేస్తామని వివరించారు. సమావేశంలో ఏఎస్పీలు వైటీ నాయుడు, బి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top