పోలీసులకు నటి తారా చౌదరి ఫిర్యాదు | Sakshi
Sakshi News home page

నమ్మించి మోసం చేశాడు

Published Fri, Dec 14 2018 9:17 AM

Actress Tara Chowdary File Cheating Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌‌: తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడమేగాక తన ఆస్తులు కాజేసేందుకు యత్నిస్తున్నాడని సినీ నటి రాజేశ్వరి అలియాస్‌ తారా చౌదరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.

సినీ నటి తారా చౌదరి శ్రీనగర్‌కాలనీ సమీపంలోని గణపతి కాంప్లెక్స్‌ సమీపంలోని అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది. 2016లో ఆమెకు వరుసకు బావ అయిన చావా రాజ్‌కుమార్‌ తన సోదరి సుజాతతో కలిసి గుంటూరులోని తారా చౌదరి ఇంటికి వచ్చాడు. తాను తారా చౌదరిని పెళ్ళి చేసుకుంటానని చెప్పగా ఇంతకుముందే పెళ్లయినందున ఎలా చేసుకుంటారని ఆమె ప్రశ్నించింది. దీంతో రాజ్‌కుమార్‌ సోదరి సుజాత కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకోవాల్సిందిగా తెలిపింది. అనంతరం అతను పలుమార్లు విజయవాడ, హైదరాబాద్‌లోని ఆమె ఇంటికి వచ్చి తాను విడాకులు తీసుకుంటానని ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెస్పాడు.

అనంతరం ఇద్దరూ హైదరాబాద్‌కు వచ్చి గణపతి కాంప్లెక్స్‌ సమీపంలో ఓ ఫ్లాట్‌ అద్దెకు తీసుకొని సహజీవనం చేయసాగారు. అందరికీ తన  తారా చౌదరిని తన భార్యగా పరిచయం చేసేవాడు. కొద్ది రోజుల అనంతరం తనకు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయని నీ ఆస్తులు విక్రయించి ఇవ్వాల్సిందిగా కోరగా ఆమె నిరాకరించింది. తనను పెళ్ళి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, గత రెండేళ్లుగా రాజ్‌కుమార్‌ తనను తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నాడని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు చావా రాజ్‌కుమార్‌పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement