వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు | Sakshi
Sakshi News home page

వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు

Published Fri, Aug 22 2014 1:26 PM

వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు - Sakshi

నకిలీ నోట్లను అరికట్టడానికి, కరెన్సీ నోట్ల జీవితకాలాన్ని పెంచడానికి వీలుగా వచ్చే సంవత్సరం నుంచి ప్లాస్టిక్ కరెన్సీ నోట్లనుప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని రిజర్వు బ్యాంకు భావిస్తోంది. మధ్యవర్తుల వ్యవస్థను పూర్తిగా అరికట్టి, కొత్తగా జాతీయ బిల్లుల చెల్లింపు వ్యవస్థను ఏర్పాటుచేయాలని కూడా యోచిస్తోంది. కరెన్సీ నోట్ల జీవిత కాలాన్ని పెంచాలని రిజర్వు బ్యాంకు భావిస్తున్నట్లు బ్యాంకు వార్షిక నివేదికలో పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్లపై కొన్నేళ్లుగా చర్చలు జరిగిన తర్వాత.. గత జనవరిలోనే రిజర్వు బ్యాంకు టెండర్లు పిలిచింది. ముందుగా చేసే ప్రయోగం విజయవంతం అయితే వచ్చే ఏడాదికల్లా విస్తృతంగా వీటిని ఉపయోగంలోకి తేవాలని అనుకుంటున్నారు.

ప్లాస్లిక్ నోట్లు వచ్చేస్తున్నాయని, వంద కోట్ల నోట్లకు సంబంధించి టెండరు బిడ్లు వచ్చాయని , ముందుగా ఐదు నగరాల్లో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెడతామని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ తెలిపారు. ప్లాస్టిక్ నోట్ల మీద ఎలాంటి మరకలు పడవు, తొందరగా చిరిగిపోవు. ఇప్పటికే పలు దేశాల్లో పాలిమర్ కరెన్సీ నోట్లను ఉపయోగిస్తున్నారు. ఇవి ఇప్పుడున్న నోట్ల కంటే ఖరీదైనవే అయినా.. జీవితకాలం ఎక్కువ కావడంతో వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండే కొచ్చి, మైసూర్, జైపూర్, భువనేశ్వర్, సిమ్లా నగరాల్లో ముందుగా ప్లాస్టిక్ నోట్లను ప్రవేశపెడతారు. ముందుగా తక్కువ డినామినేషన్ ఉన్న నోట్లను తేవాలని యోచిస్తున్నారు.

Advertisement
Advertisement