పీఎన్‌బీ స్కాం : కేంద్రం సంచలన నిర్ణయం

Nirav Modi case Govt Removes ED Mumbai Chief Over Alleged Interference - Sakshi

ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్ పై వేటు

 సొంత కేడర్‌కు బదిలీ

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముంబై చీఫ్‌కు భారీ షాక్‌ ఇచ్చింది. ఈడీ స్పెషల్ డైరెక్టర్ వినీత్ అగర్వాల్‌ను  తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్యుజిటివ్‌ వ్యాపారవేత్త పీఎన్‌బీ స్కాం నిందితుడు నీరవ్ మోదీ కేసును పరిశీలిస్తున్న అధికారులను ఆయన అకారణంగా బదిలీ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో వినీత్ అగర్వాల్‌పై ఈ వేటు వేసింది. ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా తొలగించి, తన సొంత కేడర్‌కు బదిలీ చేస్తూ ఆర్థికమంత్రిత్వ శాఖ మంగళవారం  ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణమే ఈ ఆదేశాలు  అమల్లోకి వస్తాయని పేర్కొంది.

ముఖ్యంగా ఈడీ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రత కుమార్‌ను నీరవ్ మోదీ కేసు విషయమై లండన్‌లో ఉండగా.. ఆయనను బదిలీ చేస్తూ మార్చి 29న వినీత్ అగర్వాల్  వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. అయితే వెంటనే స్పందించిన ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా, సుత్యబ్రత బదిలీని రద్దు చేశారు. జాయింట్ డైరెక్టర్ విషయంలో నిర్ణయాలు తీసుకునేందుకు స్పెషల్ డైరెక్టర్ వినిత్ అగర్వాల్‌కు ఎలాంటి అధికారాలు లేవని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంతో వినీత్‌ పదవీకాలం ఇంకా మూడేళ్లు  మిగిలి వుండగానే  ఆయనకు షాక్‌ ఇచ్చింది కేంద్రం.

కాగా 1994 ఐపీఎస్ బ్యాచ్, మహారాష్ట్రకు క్యాడర్‌కు చెందిన అధికారి వినిత్ అగర్వాల్. 2017 జనవరిలో ఆయనను డిప్యుటేషన్‌ మీద ఈడీ స్పెషల్‌ డైరెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగాల్సి ఉంది.  వినిత్ అగర్వాల్ ముంబై ఈడీ స్పెషల్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలను చూసేవారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top