కొన్నేళ్ల కనిష్టానికి ఆటోమొబైల్‌ విక్రయాలు | India's automobile industry double-digit sales decline this fiscal | Sakshi
Sakshi News home page

కొన్నేళ్ల కనిష్టానికి ఆటోమొబైల్‌ విక్రయాలు

May 30 2020 12:33 PM | Updated on May 30 2020 12:49 PM

India's automobile industry double-digit sales decline this fiscal - Sakshi

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్‌ పరిశ్రమలలో విక్రయాలు రెండంకెల స్థాయిలో క్షీణించనున్నాయని ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. ఇటీవల కోవిడ్‌-19 కారణంగా లాక్‌డౌన్‌ అమలు, పొడగింపుతో విక్రయాలు పడిపోయాయని వెల్లడించింది. మొత్తం అమ్మకాల పరిమాణం కొన్నేళ్ల కనిష్టానికి పడిపోనుంది. ప్రయాణికుల వాహనాలు(పీవీ), వాణిజ్య వాహనాల(సీవీ)విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలో భారీగా క్షీణించి 2010 ఆర్థిక సంవత్సరం కనిష్టానికి చేరవచ్చని క్రిసిల్‌ అంచనా వేసింది. 
 వాహనాల సగటు వినియోగం 58 శాతంనుంచి 50 శాతానికి క్షీణిస్తుందని తెలిపింది. పీవీ విభాగంలో సగటు వినియోగం 58 శాతం నుంచి 44 శాతానికి, ద్విచక్రవాహానాల వినియోగం 65శాతం నుంచి 50 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ట్రాక్టర్ల వాడకం అయితే 59 శాతం నుంచి 51 శాతానికి క్షీణిస్తుందని, వాణిజ్య వాహనాల వినియోగం 51 శాతం నుంచి 39 క్షీణించవచ్చని క్రిసిల్‌ వివరించింది.
 లాక్‌డౌన్‌తో వేతనాల్లో కోత, ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు ఉండడంతో వినియోగదారులు కొనుగోళ్లపై మొగ్గుచూపకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుందని క్రిసిల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ హిటల్‌ గాంధీ అన్నారు. వివిధ కంపెనీలు వ్యయ భారాలనుతగ్గించుకునేందుకు వేతనాలు, ఉద్యోగాల్లో కోతలు విధించడానికే మొగ్గు చూపుతున్నాయని, దీంతో వినియోగదారుల వద్ద సరిపడా నగదు ఉండదు. ఫలితంగా 60-70 శాతం ప్రజారవాణ వాహనాల కొనుగోళ్లు  నిర్ణయాలు వాయిదా పడతాయన్నారు. మరోపక్క  కొత్త యాక్సిల్‌ లోడ్‌ నిబంధనల ప్రభావంతో వాణిజ్య వాహనాల విక్రయాలు క్షీణిస్తున్నాయి. డిమాండ్‌ తక్కువగా ఉన్నంతకాలం రికవరీ కూడా అధికంగా ఉండే అవకాశం లేదని తెలిపారు. 
  ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్‌లు, ద్విచక్ర వాహాన విక్రయాలు వేగంగా పుంజుకోవచ్చని క్రిసిల్‌ తెలిపింది. రుతుపవనాలు సకాలంలో వచ్చి, పంటలు బాగా పండడం వల్ల గ్రామీణ ఆర్థికం మెరుగపడి కొనుగోలు శక్తి పెరగడంతో ఈ వాహన విక్రయాలు జరుగుతాయని క్రిసిల్‌ పేర్కొంది. మార్కెట్లో 50 శాతం, ఆర్థికంగా 35-45 శాతం వాటా కలిగిన ద్విచక్ర వాహానాలు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్‌ను బట్టి విక్రయాలు ఊపందుకుంటాయని తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement