భారత ఆర్థిక రంగానికి పెను సవాళ్లు 

Challenges to the Indian economy - Sakshi

అంతర్జాతీయ ద్రవ్య నిధి నివేదిక 

వాషింగ్టన్‌: భారీగా పేరుకుపోయిన మొండి బాకీలతో భారత ఆర్థిక రంగం పెను సవాళ్లను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) పేర్కొంది. కార్పొరేట్లు రుణభారం తగ్గించుకునే ప్రక్రియ మందకొడిగా సాగుతుండటం తదితర అంశాలు బ్యాంకింగ్‌ వ్యవస్థకు పరీక్షగా మారాయని, పెట్టుబడులను.. వృద్ధి వేగాన్ని వెనక్కి లాగుతున్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వ మదింపు (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ)నకు సంబంధించిన తాజా నివేదికలో ఐఎంఎఫ్‌ ఈ అంశాలు వెల్లడించింది.

ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు సంయుక్తంగా దీన్ని రూపొందించాయి. 2011 తర్వాత ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ నివేదికను విడుదల చేయడం ఇదే తొలిసారి. భారత్‌లో ప్రధానమైన బ్యాంకులు ఎదురొడ్డి నిలుస్తున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, బ్యాంకింగ్‌ వ్యవస్థకు మాత్రం చెప్పుకోతగిన స్థాయిలో ముప్పులు పొంచే ఉన్నాయని ఐఎంఎఫ్‌ తెలిపింది. భారత్‌లో క్రమంగా బ్యాంకుల ఆధిపత్యం తగ్గి.. బ్యాంకేతర సంస్థల ద్వారా రుణ వితరణ పెరుగుతోందని ఐఎంఎఫ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మారినా మొరెట్టి తెలిపారు. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల పట్టు ఇంకా చెప్పుకోతగ్గ స్థాయిలోనే కొనసాగుతోందని వివరించారు.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top