ఎయిరిండియా అమ్మకంపై స్వామి సంచలన వ్యాఖ్యలు | Air India Sale Another Scam In Making : Subramanian Swamy | Sakshi
Sakshi News home page

ఎయిరిండియా అమ్మకంపై స్వామి సంచలన వ్యాఖ్యలు

Mar 31 2018 6:10 PM | Updated on Mar 31 2018 6:10 PM

Air India Sale Another Scam In Making : Subramanian Swamy - Sakshi

ఎయిరిండియా అమ్మకంపై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తన సొంత ప్రభుత్వంపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎయిరిండియా ప్రతిపాదిత సేల్‌కు వ్యతిరేకంగా తను ప్రైవేట్‌ క్రిమినల్‌ లా కంప్లైంట్‌ దాఖలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌లో మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని వ్యాఖ్యానించారు. ఎయిరిండియాలో 76 శాతం వాటాలను అమ్మాలని కేంద్రం సిద్ధమవుతున్న క్రమంలో ఆయన ఈ ఫిర్యాదు నమోదుచేయడం సంచలనానికి తెరతీసింది. అంతేకాక  ఈ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రక్రియతో ప్రైవేట్‌ ప్లేయర్ల చేతిలోకి ఎయిరిండియా యాజమాన్య హక్కులు వెళ్లనున్నాయి.

ప్రస్తుతం ప్రతిపాదించిన ఎయిరిండియా సేల్‌ మరో కుంభకోణం చోటు చేసుకుంటుందని, ఎవరి ఈ ప్ర​క్రియ చేస్తున్నారో, ఏం చేస్తున్నారో తాను గమనిస్తున్నానని, ఒకవేళ ఏదైనా నేరం కంటపడితే ప్రైవేట్‌ క్రిమినల్‌ లా కంప్లైంట్‌ దాఖలు చేయనున్నట్టు స్వామి హెచ్చరించారు. ఎయిరిండియా విక్రయంపై మొదటి నుంచి స్వామి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 

రూ.52వేల కోట్లకు పైగా రుణ భారంతో కొట్టుమిట్టాడుతున్న ఎయిరిండియాకు 2012లో యూపీఏ ప్రభుత్వం రూ.30వేల కోట్ల బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీ కల్పించింది. ఈ నిధులతో సంస్థ నెట్టుకొస్తూ ఉంది. రెండు రోజుల క్రితమే కంపెనీలో వ్యూహాత్మక వాటా విక్రయానికి సంబంధించిన ప్రాథమిక సమాచార పత్రాన్ని కేంద్రం విడుదల చేసింది. దీని ప్రకారం 76 శాతం వాటాలు విక్రయించాలని కేంద్రం భావిస్తోంది. అలాగే, లాభాల్లో ఉన్న చౌక విమాన సేవల విభాగం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, సింగపూర్‌కి చెందిన ఎస్‌ఏటీఎస్‌తో కలిపి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ ఏఐఏటీఎస్‌ఎల్‌లో కూడా డిజిన్వెస్ట్‌మెంట్‌ ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement