కొత్త రూ.500 నోట్లకు రూ.5000 కోట్లు

About Rs 5,000 crore spent on printing of new 500 notes - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రవేశపెట్టిన కొత్త రూ.500 నోట్ల ప్రింటింగ్‌కు భారీ ఎత్తునే ఖర్చు అయింది. ఈ నోట్ల ప్రింటింగ్‌కు రూ.5000 కోట్ల వరకు ఖర్చు అయిందని కేంద్ర ప్రభుత్వం నేడు లోక్‌సభకు తెలిపింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పి. రాధాకృష్ణన్ అందజేసిన లిఖిత పూర్వక సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 8 వరకు 1,695.7 కోట్ల రూ.500 డినామినేషన్‌ నోట్లను ప్రింట్‌ చేసినట్టు మంత్రి తెలిపారు. ఈ నోట్ల మొత్తానికి రూ.4,968.84 కోట్ల వరకు ఖర్చు అయిందని పేర్కొన్నారు. అదేవిధంగా 365.4 కోట్ల రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ప్రింట్‌ చేసిందని, వీటి కోసం రూ.1,293.6 కోట్లను ఖర్చు చేసినట్టు తెలిపారు. 

రూ.2000 నోట్లు, రూ.500 నోట్ల అనంతరం చిల్లర సమస్యను పూరించడానికి కొత్తగా తీసుకొచ్చిన రూ.200 నోట్ల ప్రింటింగ్‌కు రూ.522.83 కోట్లు ఖర్చు అయిందని తెలిసింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం రూ.50, 200, 500, 2000 నోట్లను కొత్త డిజైన్‌లో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినట్టు మంత్రి లోక్‌సభకు వెల్లడించారు. కాగ, ఆర్‌బీఐ నుంచి ప్రభుత్వానికి బదిలీ చేసే మిగులు 2016-17 సంవత్సరంలో రూ.35,217 కోట్లకు తగ్గిందని, దీనికి గల ప్రధాన కారణం కరెన్సీ నోట్ల ప్రింటింగ్‌ ఖర్చులు పెరగడమేనని మరో లిఖిత పూర్వకసమాధానంలో తెలిపారు. 2015-16లో ఆర్‌బీఐ రూ.65,876 కోట్లను ప్రభుత్వానికి బదిలీ చేసిందని తన సమాధానంలో వెల్లడించారు. గతేడాది నవంబర్‌ 8న ప్రభుత్వం పెద్ద నోట్లు రూ.500, రూ.1000ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. డిమానిటైజేషన్‌ అనంతరం ఆర్‌బీఐ కొత్త కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. ఈ రిమానిటైజేషన్‌ ప్రక్రియలోనే కొత్తగా రూ.50, 200, 500, 2000 నోట్లు మార్కెట్‌లోకి వచ్చాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top