ప్రజాగ్రహాన్ని చూసైనా కళ్లు తెరవండి

YSRCP Leader Kurasala Kannababu Fires On Government - Sakshi

వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు

కాకినాడ : ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లో ఎంత బలీయంగా ఉందో సోమవారం విజయవంతంగా జరిగిన బంద్‌ రుజువు చేస్తోందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా కోరుతూ జిల్లా బంద్‌ విజయవంతమైన సందర్భంగా కన్నబాబు సోమవారం రాత్రి విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా రావడం ద్వారా మాత్రమే ఆంధ్రప్రదేశ్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందన్న విశ్వాసం ప్రజల్లో ఉందన్నారు. విభజన హామీలు నెరవేర్చకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రజలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీరని ద్రోహం చేశాయన్నారు. హోదా వల్ల కలిగే ప్రయోజనాలను విస్మరించి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీల వైపు మొగ్గు చూపడం వల్లే ఆంధ్రప్రదేశ్‌ తీవ్రంగా నష్టపోయిందన్నారు.

హోదా ఆవశ్యకతను తెలియజేస్తూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గడచిన నాలుగేళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిందన్నారు. ముఖ్యంగా రాజకీయ ప్రయోజనాలకన్నా పదవులు ముఖ్యంకా దని స్పష్టం చేస్తూ తమ పార్టీ ఎంపీలు రాజీనామాలు చేయడంతోపాటు పది రోజులుగా జిల్లా అంతటా నిరసన దీక్షలు, ధర్నాలు, రైలురోకోలు వంటి ఎన్నో నిరసనలు తెలియజేసిందన్నారు. ఇన్నాళ్ళు నోరు మెదపని టీడీపీ నేతలు ఇప్పుడు రోడ్డెక్కుతున్న తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు.  స్వయంగా ముఖ్యమంత్రి దీక్ష చేస్తాననడం మరింత విడ్డూరంగా ఉందన్నారు. నిజంగా చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే టీడీపీ ఎంపీలతో రాజీనామాలకు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని కన్నబాబు నిలదీశారు. ఇప్పటికైనా ప్రజల మనోభావాలను గుర్తించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించకపోతే అలాంటి ప్రభుత్వాలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top