బాబు విషప్రచారాన్ని తిప్పి కొట్టండి

Ysrcp Leader Konda Reddy Comments On Cm Chandrababu Naidu - Sakshi

గుమ్మఘట్ట : ప్రత్యేక హోదా విషయంలో రోజుకో మాట మార్చుతూ హోదాను తాకట్టుపెట్టిన సీఎం చంద్రబాబు నాయుడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడని, వైఎస్సార్‌సీపీపై ఆయన చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆ పార్టీ జిల్లా పరిశీలకుడు వైఎస్‌ కొండారెడ్డి, రాయదుర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. గుమ్మఘట్ట మండలంలోని గొల్లపల్లిలో పార్టీ మండల కన్వీనర్‌ గౌని కాంతారెడ్డి అధ్యక్షతన శని వారం బూత్‌ కన్వీనర్లు, గ్రామ కమిటీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండారెడ్డి, కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాలుగేళ్లపాటు హోదా సంజీవిని కాదంటూ మాట్లాడి హోదా కోసం సాగిన ప్రజాపోరును నియంతలా అణచివేశారన్నారు.

ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్‌సీపీ రాజీలేని పోరాటం చేస్తోందని, ఈ విషయం ప్రజలకు బాగ తెలుసని చెప్పారు. అందరం సమష్టి కృషితో పనిచేసి పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. ప్రతి బూత్‌లోనూ పార్టీ పటిష్టంగా ఉండేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రధానంగా పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని, వారు పడుతున్న కష్టాలను ఎన్నటికీ మరచిపోలేమని చెప్పారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యకు పరిష్కారం దిశగా రాజీ లేని పోరాటం చేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. వైఎస్‌ జగన్‌ అంతకంటే రెట్టింపు స్థాయిలో చేస్తాడని చెప్పాలన్నారు.
నిరంతరం ప్రజలమధ్యే...
నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే తన కుటుంబం పాటుపడుతుందని కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అధికారం ఇచ్చినా.. ఇవ్వకపోయినా ప్రజలే ఊపిరిగా ముందుకెళ్తున్నానని చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే ఈ ప్రాంత రూపురేఖలే మార్చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఉపేంద్రరెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి బీటీపీ గోవిందు, జిల్లా స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు మహేష్, సర్పంచ్‌ విజేంద్ర, కలుగోడు, గొల్లపల్లి పీఎసీఎస్‌ అధ్యక్షులు ఎన్‌.తిప్పేస్వామి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top