ఎన్నికల సమర శంఖారావం ప్రారంభం

YS Avinash Reddy Starts Election Battle in YSR Kadapa - Sakshi

ప్రారంభించిన మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ప్రొద్దుటూరు : సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన సమర శంఖారావాన్ని బుధవారం ఉదయం ప్రారంభించారు. ముందుగా శ్రీకన్యకాపరమేశ్వరిదేవి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యేతోపాటు ఆయన సతీమణి రాచమల్లు రమాదేవి స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు శ్రీనివాసాచార్యులు, నటరాజస్వామిలకు ఎమ్మెల్యే దంపతులు నూతన వస్త్రాలను సమర్పించి పాదాభివందనం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తు కల్పించిన మేనమామ విజయమునిరెడ్డి సమాధి వద్ద ఎమ్మెల్యే పూజలు చేశారు.తర్వాత ఆలయం ముందు ఏర్పాటు చేసిన వేదికపై మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి శంఖం ఊది ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించగా వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి  విజయడంకా మోగించి బెలూన్లను ఎగురవేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని సూచిస్తూ ఫ్యాన్‌ను తిప్పారు. రామేశ్వరం పరిధిలోని వీధుల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

పది అసెంబ్లీ సీట్లు,రెండు పార్లమెంట్‌స్థానాల్లో గెలుపు
వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీæ అధ్యక్షుడు కె.సురేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న టీడీపీలతో ప్రజలు విసివేసారి పోయారన్నారు.  తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలతో ప్రజలకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. 85 రోజుల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇక్కడ ఎన్నికల శంఖారావాన్ని ప్రారంభించామన్నారు. పార్టీ శ్రేణులు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని కోరారు. మన జిల్లాకు సంబంధించి 10 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్‌ స్థానాలను గెలుచుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి బుధవారం ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు.  మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రెండో మారు ఎమ్మెల్యే అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రచారం చేస్తున్నారన్నారు.

సెంటిమెంట్‌గా ఆయన పురాతనమైన ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించడం శుభపరిణామమని తెలిపారు.  ప్రతిపక్షంలో ఉండగానే ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాచమల్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే అవకాశం ఉందన్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఉదయాన్నే కన్యకాపరమేశ్వరిదేవి ఆలయానికి వెళ్లి పూజలు చేసి, ఈ ఆలయానికి వచ్చానన్నారు. తనతోపాటు వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారన్నారు. మాకు జిల్లా అధ్యక్షుడు విజయఢంకా మోగించారన్నారని తెలిపారు.   వైఎస్సార్‌సీపీ పట్టణా«ధ్యక్షుడు చిప్పగిరి ప్రసాద్, మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ వంగనూరు మురళీధర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి,  నియోజకవర్గ యూత్‌ ఇన్‌చార్జి సానపురెడ్డి ప్రతాప్‌రెడ్డి, దేవీప్రసాదరెడ్డి, నారాయణరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి శేఖర్, పార్టీ నాయకులు పోరెడ్డి నరసింహారెడ్డి, కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి లక్కిరెడ్డి పవన్‌కుమార్‌రెడ్డి,  వరికూటి ఓబుళరెడ్డి, బంగారు రెడ్డి, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అక్బర్‌ పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top