నగరాభివృద్ధే లక్ష్యం | Sakshi
Sakshi News home page

నగరాభివృద్ధే లక్ష్యం

Published Fri, Jan 30 2015 12:18 AM

నగరాభివృద్ధే లక్ష్యం - Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్
 
హార్డ్‌వర్క్‌తోనే మెరుగైన పాలన
రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ కీలకం
సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
ఆస్తిపన్ను పెంపుపై స్టడీ చేస్తున్నానని వెల్లడి

 
 సాక్షి : సింగపూర్ ట్రిప్ ఎలా సాగింది. శిక్షణలో ఏం నేర్చుకున్నారు.
 

కమిషనర్ : చాలా బాగా సాగింది. రాజధాని నగరం ఎలా ఉండాలి... రిసోర్స్, ఇంప్లిమెంటేషన్ తదితర అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ప్లానింగ్ చాలా ముఖ్యమనే విషయం స్పష్టంగా అర్థమైంది.
 
సాక్షి : నగర సుందరీకరణకు ఎటువంటి చర్యలు    తీసుకుంటున్నారు?
 
కమిషనర్ : రాజధాని నేపథ్యంలో నగరాన్ని సుందరీకరించాల్సిన అవసరం ఉంది. దేశ, విదేశాల నుంచి వీఐపీలు వచ్చి వె ళుతున్నారు. ఈక్రమంలో సుందరీకరణపై ప్రధానంగా దృష్టిసారించాం. కాల్వలు, సహజవనరులు నగరంలో పుష్కలంగా ఉన్నాయి. వీటిని ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ డెరైక్టర్ శ్రీధరన్, జీఎంఆర్ ఎక్స్‌పర్ట్స్‌తో త్వరలోనే చర్చిస్తాం. ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఖర్చు చేయాలనే దానిపై ఒక అవగాహనకు వచ్చాక సుందరీకరణ పనులు చేపడతాం.
 
సాక్షి : స్మార్ట్ వార్డుల ఏర్పాటుకు  ప్రణాళిక ఎంతవరకు వచ్చింది?
 
కమిషనర్
: మౌలిక వసతులు, అందరికీ జీవనోపాధి, డ్రాప్ అవుట్స్ లేకపోవడం వంటి 20 లక్ష్యాలతో స్మార్ట్ వార్డులను అభివృద్ధి చేయాల్సి ఉంది. ఇందుకు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, వీఐపీల భాగస్వామ్యం అవసరం. ఎంపీ, ఎమ్మెల్యేలు, మేయర్, కార్పొరేటర్లతోపాటు నగరంలోని సెలబ్రిటీలు, వ్యాపార ప్రముఖులు, సినిమా నటులను భాగస్వాములను చేయాలని నిర్ణయించాను. వీరితో చర్చలు ప్రారంభించాము. ఒక్కోవార్డును ఒక్కొక్కరికి ద త్తత ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందించాను.
 
సాక్షి : ఆస్తిపన్ను పెంపు ప్రతిపాదన ఎంతవరకు వచ్చింది?

 
కమిషనర్ : నగరంలో ఆస్తిపన్ను పెంపునకు సంబంధించి వివిధ వర్గాల వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయాల్సి ఉంటుంది. గతంలో కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. నాన్ రెసిడె న్షియల్ టాక్స్‌కు సంబంధించి 2007లో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆస్తిపన్ను పెంపుపై ఒక నిర్ణయం తీసుకుంటాం. పరిస్థితులను స్టడీ చేస్తున్నా.
 
సాక్షి : డంపింగ్‌యార్డు స్థల సేకరణ సమస్య ఎప్పటిలోగా పరిష్కరిస్తారు?


కమిషనర్ : నగరపాలక సంస్థలో ఇది ప్రధాన సమస్య. స్థల సేకరణకు ఏర్పాట్లుచేస్తున్నాం. జి.కొండూరు మండలం కడియం పోతవరం గ్రామంలో భూమిని పరిశీలించాను. ఎకరం కోటి రూపాయలు చెబుతున్నారు. రైతులతో సంప్రదింపులు జరపాలని తహశీల్దార్‌తో చెప్పాను. నున్న ప్రాంతంలో స్థలాన్ని త్వరలోనే పరిశీలిస్తాను. నెల రోజుల్లో  స్థలాన్ని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాను.
 
సాక్షి : గడువులోపు జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పనులు పూర్తిచేయగలరా? ఇళ్ల కేటాయింపుపై ఏం నిర్ణయం తీసుకున్నారు.

కమిషనర్ : మార్చి 31వ తేదీలోపు జేఎన్‌ఎన్యూఆర్‌ఎం పనులను పూర్తి చేయాల్సి ఉంది. పెండింగ్ పనులు, రావాల్సిన నిధులపై ఫిబ్రవరి 2న  సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటుచేశా. సాధ్యమైనంతవరకు గడువులోపు పనుల్ని పూర్తిచేస్తాం. అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే ఇళ్లు కేటాయిస్తాం.  

సాక్షి : నగరపాలక సంస్థలో ఆడిట్, కోర్టు కేసులు పెండింగ్ ఉన్నాయి. బడ్జెట్ తయారీలో జాప్యం జరుగుతోంది. దీనికి కారణం ఏమంటారు?

కమిషనర్ : మీరు చెప్పింది నిజమే. 255 కేసులో కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఆడిట్ అప్‌డేట్‌గా జరిగితేనే పాలన పారదర్శకంగా ఉంటుంది. వీటిపై ప్రత్యేక దృష్టిస్తా. బడ్జెట్ రూపొందించడంలో జాప్యం జరిగింది. అధికారులు ప్రస్తుతం బడ్జెట్ తయారు చేసేపనిలో నిమగ్నమయ్యారు. త్వరలోనే బడ్జెట్‌ను అప్రూవల్ కోసం స్టాండింగ్ కమిటీకి పంపుతాం.

సాక్షి : ఉదయం 5.30 గంటలకే నగర పర్యటనకు వెళ్తున్నారు. దీనికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

కమిషనర్ : ఉంది. ఐఏఎస్ శిక్షణలో ఉన్న సమయంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎలా వ్యవహరించాలనే దానిపై గుల్జార్ శిక్షణ ఇచ్చారు. ఉదయం 5.30 గంటలకు రోడ్డుపైకి వెళితేనే  వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని ఆయన చెప్పారు. ఆ స్ఫూర్తితోనే హార్డ్‌వర్క్ చేస్తున్నా. జాబ్ ఏం డిమాండ్ చేస్తే అది చేయాలన్నది నా అభిప్రాయం.

సాక్షి : రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా మీపైన ఉన్నాయా?

కమిషనర్ : ఇప్పటివరకు అలాంటివి ఏమీ లేవు. అర్బన్ లోకల్ బాడీలో ఎలా పనిచేయాలనే దానిపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించడం కోసం కృషిచేస్తా. నగరాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తా.
 
 

Advertisement
Advertisement