‘‘రాష్ట్రం విడిపోతే భావి తరాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అన్ని విధాల నష్టం వాటిల్లుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు మినహా మంచినీరు దొరకని పరిస్థితి.
కమలాపురం/కడప: సాక్షి: ‘‘రాష్ట్రం విడిపోతే భావి తరాల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అన్ని విధాల నష్టం వాటిల్లుతుంది. కుప్పం నుంచి శ్రీకాకుళం వరకూ ఉప్పునీరు మినహా మంచినీరు దొరకని పరిస్థితి. విభజన వల్ల వాటిల్లే నష్టాలను సవివరంగా చెబుతున్నా కేంద్రం విభజన ప్రక్రియను ముందుకు తీసుకెళుతోంది. దీనికి కారణం సీఎం కిరణ్ అసమర్థ వైఖరి, చంద్రబాబు రెండు నాల్కల ధోరణే. ఇప్పటికైనా ప్రజల భవిష్యత్తు దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలి. అందుకోసం పార్టీలకతీతంగా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా అఫిడవిట్లను దాఖలు చేసి రాష్ట్రపతికి ఇవ్వాలి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు అన్నిపార్టీలకు విన్నవించారు.
కమలాపురంలో ఆ నియోజకవర్గ సమన్వయకర్త రవీంద్రనాథరెడ్డి అధ్యక్షతన ఆదివారం ‘సమైక్యశంఖారావం’ సభ నిర్వహించారు. ఈసభకు కేంద్రపాలక మండలి సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నేతలు హాజరయ్యారు. ఇతర పార్టీల ప్రజాప్రతినిధులంతా ఓ వైపు...ప్రజలంతా మరో వైపు ఉన్నారని, ప్రజల తరఫున రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం కోసం జగన్ పోరాటం చేస్తున్నారని రవీంద్రనాథరెడ్డి అన్నారు. కాంగ్రెస్, టీడీపీ రెండూ కూడా విభజనకు సహకరిస్తున్నాయన్నారు.
ప్రజలు రేషన్ కార్డుల నుండి పింఛన్ల వరకూ అన్ని సమస్యలతో అల్లాడుతుంటే వాటిని పరిష్కరించకుండా రాష్ట్రాన్ని విభ జించడంపైనే ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన విమర్శించారు. విభజనకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలిసి రావాలని లేదంటే భావితరాల భవిష్యత్తును అంధకారం చేసిన వారికి చరిత్రలో నిలిచిపోతారన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తిరుపాలరెడ్డి, రైతువిభాగం కన్వీనర్ సంబటూరు ప్రసాదరెడ్డి, వైఎస్సార్ సీపీ నేతలు అఫ్జల్ఖాన్, కాల్టెక్స్ హఫీజుల్లా, మైనార్టీసెల్ రాష్ట్రనేత ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగ సంఘం నేత అమ్ముడుపోయారు:
- కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే
సమైక్యవాదం ముసుగులో ఉద్యమించిన ఓ ఉద్యోగ సంఘం నాయకుడు టీడీపీ, కాంగ్రెస్లకు అమ్ముడుపోయాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు దారుణానికి ఒడిగట్టాడు. అయినా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలిగే శక్తి జగన్కు మాత్రమే ఉంది. అందుకే దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగట్టి సమైక్యం కోసం పోరాడుతున్నారు.
ఎంపీ సీట్లు మినహా మరో ఆలోచనలేదు:
- ఆకేపాటి అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే
రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలు చేస్తే ఎన్ని సీట్లు వస్తాయి అనే ఆలోచన తప్ప సోనియాకు మరో ఆలోచన లేదు. బిల్లు అడ్డుకుంటామని చెప్పిన సీఎం కిరణ్, చంద్రబాబు అసలు అసెంబ్లీకే రాలేదు. దీంతో తెలంగాణ నేతలు బిల్లుపై చర్చ జరిపారు. చర్చ జరగకుండా అడ్డుపడ్డాం.