సీఎం జగన్‌కు టీటీడీ వేద పండితుల ఆశీర్వచనాలు

TTD Priests Give Blessings To CM YS Jagan Mohan Reddy - Sakshi

సాక్షి, తాడేపల్లి : నూతన సంవత్సరం సందర్భంగా ముఖ‍్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి టీటీడీ అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. తాడేపల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రికి  వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్ధప్రసాదాలు, శేష వస్త్రాలను అందచేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయా శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి భక్తులకు ఉచిత లడ్డూ
2020 ఆంగ్ల నూతన సంవత్సరంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఉచిత లడ్డూను అందచేయాలని టీటీడీ నిర్ణయించింది. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారి మెట్లు మార్గాల నుంచి కాలినడకన తిరుమల వచ్చే భక్తులకు మాత్రమే ఒక ఉచిత లడ్డూను టీటీడీ అందచేస్తోంది. ఆ మేరకు ప్రతి రోజు 20వేల లడ్డూలను అందిస్తోంది. నూతన ప్రతిపాదనలో భాగంగా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా అందచేయనుంది. ఈ విధానాన్ని వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 6 నుంచి అమలులోకి తీసుకురానుంది.

టీటీడీలో మరో ఆరు నెలలు సమ్మె నిషేధాజ్ఞలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అత్యవసర విభాగాల్లో పనిచేసే సిబ్బంది మరో ఆరు నెలల పాటు సమ్మె చేయడాన్ని నిషేధిస్తూ దేవాదాయ శాఖ కార్యదర్శి నిన్న (మంగళవారం) ఉత్తర్వులిచ్చారు. టీటీడీలో ప్రతి ఆరు నెలలకొకసారి ఇలా సమ్మెను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం సాధారణంగా జరిగే ప్రక్రియ.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top